పెద్దేముల్, ఫిబ్రవరి 9 : ఉచిత కుట్టు మిషన్ శిక్షణను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్ కలెక్టర్ నిఖిల అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదురుగా ఉన్న షాపింగ్ కాంప్లెక్స్లో లైవ్లీహుడ్ ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా స్వామి వివేకానంద రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నాబార్డు ద్వారా ఏర్పాటు చేసిన ఉచిత కుట్టుమిషన్, ఫ్యాషన్ డిజైనింగ్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించుకోవడం సంతోషకరమన్నారు. ప్రతి మహిళకు ప్రతి రోజు రూ.50, ఒక పూట భోజన సౌకర్యం కల్పించడం అభినందనీయమన్నారు. శిక్షణ మహిళలకు ఎంతో లాభదాయకమని చెప్పారు. ముద్ర, స్టాండప్ ఇండియాలో భాగంగా రూ.50 వేల నుంచి అంతకుపైగా పెద్ద యూనిట్ నెలకొల్పేందుకు కూడా రుణాలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి మహిళా ఆర్థికంగా ఎదిగేందుకు ఈ శిక్షణ పూర్తిస్థాయిలో ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రతి రోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణ ఉంటుందని తెలిపారు. అనంతరం శిక్షణ నిపుణులు, మహిళలతో మాట్లాడి పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. కొంతమంది కలెక్టర్కు పలు సమస్యలను వివరించగా స్పందించిన కలెక్టర్ సంబంధిత అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ ద్యావరి విజయమ్మ, తాసిల్దార్ ఫహీం ఖాద్రి, నాబార్డు జిల్లా డెవలప్మెంట్ మేనేజర్ ఎస్.ప్రవీణ్కుమార్, ఎల్డీఎం డి.రాంబాబు, సంస్థ సీఈవో ఎండీ.గౌస్మియా, కోఆర్డినేటర్ అశోక్, శిక్షణ నిపుణులు, గ్రామ వివిధ స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు.