GO 111 | ఆంక్షలు తొలగిపోవడంతో 111 జీవో పరిధి అభివృద్ధికి కేంద్రంగా మారనున్నది. ఒక్క మాటలో చెప్పాలంటే హైదరాబాద్ వంటి మరో కొత్త నగరం వస్తుందనే అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. అటు ఐటీ కారిడార్… ఇటు అంతర్జాతీయ విమానాశ్రయం మధ్యలో ఔటర్ రింగు రోడ్డు లోపల, బయట విస్తరించిన ఈ ప్రాంతమంతా ఇక నుంచి నివాసాలు, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు పెద్ద ఎత్తున జరిగేందుకు ఆస్కారం ఏర్పడింది.
జంట జలాశయాలు ఉన్న ఈ ప్రాంతంలో పచ్చదనానికి అధిక ప్రాధాన్యతనిస్తూ నిర్మాణాలు జరిగే మాస్టర్ప్లాన్ను రూపొందించనున్నారు. ఇందుకు అనుగుణంగా 111 జీవో పరిధిలో కొత్తగా నివాసాలతో పాటు ఐటీ కంపెనీల కార్యకలాపాలు, ఇతర వ్యాపార, వాణిజ్య సంస్థలు సేవలు మొదలైతే ఈ ప్రాంతంలో జనసాంద్రత గణనీయంగా పెరుగుతుంది. కొత్తగా ఉద్యోగ, ఉపాధి అవకాశాల కారణంగా ప్రజా రవాణా పరంగా ఎయిర్పోర్టు మెట్రో మార్గం అత్యంత కీలకంగా మారుతుందని మెట్రో అధికారి ఒకరు చెప్పారు.
గతంలో 111 జీవో ఆంక్షల కారణంగా రెండున్నర దశాబ్దాలుగా ఇండ్ల నిర్మాణం జరగని ప్రాంతాల్లో ఇక కొత్తగా నివాస సముదాయాలు వస్తే, వారంతా మెట్రో రైలులో నగర నలుమూలలా ప్రయాణం చేసేందుకు అవకాశం కలుగుతుంది. ఇప్పటికే మొదటి దశ మెట్రో రైలు ప్రాజెక్టులో మూడు కారిడార్లు కోర్సిటీలోని ప్రధాన ప్రాంతాలైన హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, అమీర్పేట, మియాపూర్, ఎల్బీనగర్, నాగోల్, ఉప్పల్, సికింద్రాబాద్, జేబీఎస్, ఎంజీబీఎస్, అబిడ్స్, కోఠి ఇలా ఎన్నో ప్రాంతాలకు మెట్రోలోనే వెళ్లేందుకు అనుకూలంగా ఉంది. కొత్తగా నిర్మిస్తున్న ఎయిర్పోర్టు మెట్రో మార్గాన్ని మొదట దశతో ఐటీ కారిడార్లోని రాయదుర్గం మెట్రో స్టేషన్ వద్ద అనుసంధానిస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెట్రో స్టేషన్ దిగకుండానే ఒక రైలు నుంచి మరో రైలులోకి మారితే చాలు 60 కి.మీ దూరం నగరం ఒక చివర నుంచి మరో చివరకు చేరుకునేలా ప్రయాణం అందుబాటులోకి వస్తుంది.