ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్ -19 మహమ్మారిని ఎదుర్కోవడానికి తమ సంస్థ ప్రత్యామ్నాయ ఆయుర్వేద, వనమూలికల మిశ్రమంగా ‘అపర సంజీవిని’ పేరుతో చూర్ణాన్ని తయారు చేసినట్లు ప్రముఖ బయోటెక్నాలజీ సంస్థ దండమూడి బయోటెక్ అధినేత డా॥ దండమూడి అవనీంద్ర కుమార్ తెలిపారు. ఎర్రమంజిల్లోని మెర్క్యూర్ హోటల్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయుర్వేద వైద్యులు డా॥ బత్తిని రాజ్ కుమార్తో కలిసి అవనీంద్ర కుమార్ మాట్లాడారు. ప్రకృతిలో లభించే 32 రకాల ఔషధ గుణాలు కలిగిన వనమూలికల మిశ్రమంగా తయారు చేసిన ‘అపర సంజీవిని’ చూర్ణంతో రోగ నిరోధకశక్తి పెరుగుతుందని, యాంటీ వైరస్, యాంటీ బ్యాక్టీరియాగా తయారవడంతో శ్వాస సంబంధిత సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొంటుందన్నారు. కొవిడ్ 19 బారిన పడిన రోగుల్లో సైతం అపర సంజీవిని చూర్ణంతో రోగ నిరోధక శక్తి పెరిగినట్లు గుర్తించామన్నారు.