వన్యప్రాణులకు రక్షణ కరువైంది. మహావీర్ హరిణ వనస్థలి జాతీయ వనంలోని మర్రిపల్లి అటవీ ప్రాంతంలో పదుల చోట్ల కంచె కనిపించడమే లేదు. ఎండలు మండుతున్న నేపథ్యంలో జింకలు, ఆలుగులు, ఇతర జంతువులు బయటకొచ్చి ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు లేకపోలేదు. కుక్కలు సైతం అడవిలోకి వెళ్లి అటవీ జంతువులపై దాడి చేసే ప్రమాదం ఎక్కువగా ఉన్నది.
పెద్దఅంబర్పేట, మార్చి 19 : మహావీర్ హరిణ వనస్థలి జాతీయవనం విజయవాడ జాతీయ రహదారిని ఆనుకుని నగరంలోని ఆటోనగర్లో మొదలై పెద్దఅంబర్పేట మున్సిపాలిటీ పరిధిలోని తట్టిఅన్నారం మీదుగా మర్రిపల్లిలో ముగుస్తుంది. వేల ఎకరాల్లో ఇది విస్తరించి ఉన్నది. మర్రిపల్లి పరిధిలోని అటవీ ప్రాంతంలో వందల సంఖ్యలో జింకలు, అడవి పందులు, నెమళ్లు, కుందేళ్లు, అలుగులు, వివిధ రకాల పక్షి జాతులు ఉన్నాయి. ఇంత విలువైన జంతు సంపద ఉన్న అటవీ ప్రాంతానికి రక్షణ కంచెలు కరువయ్యాయి. తట్టిఅన్నారం ఇందు అరణ్య ఎదురుగా ఉన్న కొత్త రోడ్డును ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతంలో చాలాచోట్ల రక్షణ కంచె లేదు. నేరుగా వాహనాలు వెళ్లేలా ఉండడంతో అధికారుల నిర్లక్ష్యం ఎంతగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. కొన్నిచోట్ల ఇనుప కంచె తెగిపోయి ఉండగా.. మరికొన్ని చోట్ల అసలు కంచెనే కనిపించడం లేదు.
మందుబాబులు వెళ్తున్నారా ?
తట్టిఅన్నారం ఇందు అరణ్య ఎదురుగా ఉన్న కొత్త రోడ్డులో ఇటీవల వాహనాల రద్దీ పెరిగింది. తట్టిఅన్నారం-మర్రిపల్లి మార్గంలోని హరిణ వనస్థలి పార్కు ప్రాంతం వెంట ఇటీవల భారీ వాహనాలు ఎక్కువయ్యాయి. అటవీ ప్రాంతానికి సరైన కంచెలేక జంతువులు బయటికి వచ్చి రోడ్డు ప్రమాదాల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు, ఇందు అరణ్య ఎదురుగా ఉన్న కొత్త రోడ్డులో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. రహదారుల పక్కనే నిలబడి మద్యం సేవించే మందుబాబులకు ఇది అడ్డగా మారింది. ఇదే అదునుగా కొందరు మందుబాబులు అటవీ ప్రాంతంలోకి వెళ్తున్నట్టు అక్కడ ప్రచారం జరుగుతున్నది. అటవీ ప్రాంతానికి సరైన కంచెలు లేకపోవడం మందుబాబులకు కలిసొస్తున్నదనే మాటలు వినిపిస్తున్నాయి. అటవీ ప్రాంతంలో భారీ వృక్షాలు ఉండటం, వాతావరణం చల్లగా ఉండటం, పోలీసులకు ఎలాంటి అనుమానం రాకుండా ఉంటుందని ఈ ప్రాంతంలో కొందరు మందు తాగేందుకు ఇష్టపడుతున్నారనే ప్రచారం నడుస్తున్నది. అటవీ ప్రాంతంలోకి ఇలా యథేచ్ఛగా మందుబాబులు చొరబడడం చూస్తుంటే విలువైన జంతు సంపదకు ప్రమాదం ఉన్నదని జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కుక్కలతో భద్రం
ఇటీవల నగర శివారు ప్రాంతాల్లో కుక్కల బెడద ఎక్కువైంది. నగరంలో పట్టుకున్న కుక్కలను సైతం పలువురు రాత్రి సమయాల్లో శివారుల్లోని కాలనీల్లో వదిలి వెళ్తున్నారు. ఇది కాలనీల వాసులకు ఇక్కట్లు తెచ్చిపెడుతున్నది. ఇది ఒకవైపు అయితే.. మరోవైపు హరిణ వనస్థలి పార్కు అటవీ ప్రాంతానికి సరైన రక్షణ కంచె లేక జంతువులు బయటికొచ్చే అవకాశం ఉన్నది. ఆ సమయంలో కుక్కల కంట పడితే అవి దాడి చేస్తాయి. రక్షణ కంచె సరిగా లేకపోవడంతో ఆయా ప్రాంతాల నుంచి కుక్కలే గుంపులుగా అటవీ ప్రాంతంలోకి చొరబడే అవకాశాలూ లేకపోలేదు. ఒక్కసారి జింకలు, ఇతర జంతువులు కుక్కలకు కనిపిస్తే చుట్టుముట్టి దాడి చేస్తున్నాయి. గతంలోనూ పలుసార్లు అడవి పందులు రోడ్లపై ప్రమాదాలకు గురయ్యాయని స్థానికులు చెబుతున్నారు. అధికారులు అటవీప్రాంతానికి శాశ్వతంగా రక్షణ గోడలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని జంతు ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు.