మియాపూర్, జనవరి 6: సింహభాగం ఐటీ ప్రాంతానికి వేదికగా ఉన్న శేరిలింగంపల్లి జోన్లోని వీధులను విదేశాలను తలపించేలా తీర్చిదిద్దే కార్యక్రమానికి అధికారులు శ్రీకారం చుడుతున్నారు. రొటీన్కు భిన్నంగా వాటిని అందంగా మలచి ఆకట్టుకునేలా ప్రణాళికలను రూపొందిస్తున్నారు. ఐటీ జోన్లో విశాలమైన పరిశుభ్రమైన రహదారుల నిర్మాణాలు అందుబాటులో ఉన్న నేపథ్యంలో.. స్ట్రీట్ ఫర్నిచర్ తరహాలో అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. శేరిలింగంపల్లి జోన్ వ్యాప్తంగా 24 ప్రాంతాలను స్ట్రీట్ ఫర్నిచర్ అభివృద్ధికి అనుకూలంగా ఉన్నట్లు క్షేత్రస్థాయిలో గుర్తించిన అధికారులు ..అందుకు అనుగుణంగా నిధుల కేటాయింపు..పనుల ప్రారంభంపై దృష్టిని సారించారు.
శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని శేరిలింగంపల్లి, చందానగర్, యూసుఫ్గూడ, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలో 24 ప్రాంతాలను స్ట్రీట్ ఫర్నిచర్ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం అయ్యాయి. చందానగర్ సర్కిల్ పరిధి శేరిలింగంపల్లి సర్కిల్ , యూసుఫ్గూడ సర్కిల్స్ను స్ట్రీట్ ఫర్నిచర్ అభివృద్ధికి ఎంపిక చేశారు. ప్రధానంగా కూడళ్లు, వీధుల గోడలపై అందమైన చిత్రాలు, చక్కని లాన్ల ఏర్పాటు, కాఫీ బేలు, పచ్చదనం, చిన్నారులు ఆడుకునేలా ఆట పరికరాలు , అందమైన వీధి దీపాలు, ఫౌంటెయిన్లు, తదితర బొమ్మలు ఏర్పాటు చేస్తారు. ఐటీ జోన్లోని పలు ప్రాంతాలను విదేశాలను తలపించేలా రూపొందించాలన్నది తమ లక్ష్యమని జోనల్ కమిషనర్ శంకరయ్య తెలిపారు.