మాదాపూర్, జూన్ 14 : మాదాపూర్ డివిజన్ ప్రజలకు మెరుగైన వసతులను కల్పించడంలో నిరంతరం ముందుంటానని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ అన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్యానగర్, సుభాష్చంద్రబోస్ నగర్ కాలనీలో మంగళవారం ఏర్పాటు చేసిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా కాలనీలో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ ..శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతానని అన్నారు. ప్రతి ఒక్కరు పరిసరాల పరిశుభ్రతపై దృష్టి సారించి కాలనీలను పరిశుభ్రతలో అగ్రగామిగా నిలపాలన్నారు. కాలనీల్లో, బస్తీలో పేరుకుపోయిన చెత్త చెదారం, డ్రైనేజీ వ్యవస్థను శుభ్ర పరచడం, మురికి నీటి గుంతలను తొలగించి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడమే పట్టణ ప్రగతి ముఖ్య ఉద్దేశమన్నారు.
కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ వి. జగదీశ్వర్ గౌడ్, మాదాపూర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ శంకరయ్య, ఉప కమిషనర్ సుదాంష్, ఈఈ శ్రీకాంతి, హెల్త్ ఆఫీసర్ కార్తీక్, ఏఈ ప్రశాంత్, డీజీఎం శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.