దోమ, ఫిబ్రవరి 23 : గ్రామాల్లోని సర్పంచ్లు, అధికారులు సమష్టిగా కలిసి అభివృద్ధి పనులను చేపట్టాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. దోమ మండలం దోర్నాల్పల్లి గ్రామంలో గురువారం కలెక్టర్ ట్రైనీ కలెక్టర్ సంచిత్ గంగ్వార్తో కలిసి పర్యటించి రోడ్లు, నీటి వసతులను పరిశీలించారు. అనంతరం హరితహారం నర్సరీ, పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామాలతోపాటు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో పలు శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించి విధివిధానాలపై సూచనలు చేశారు.
సమష్టిగా కలిసి పనిచేయాలి
ప్రభుత్వం ఎన్నో ప్రతిష్టాత్మకమైన అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నదని.. సర్పంచ్లు, అధికారులు సమష్టిగా కలిసి పనిచేయాలని కలెక్టర్ తెలిపారు. హరితహారం నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, వైకుఠధామాలు, డంపింగ్ యార్డుల నిర్మాణంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. పారిశుధ్యం, తాగునీటి సౌకర్యంపై అధికారులు ఆరా తీస్తూ పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్లకు ఇరువైపులా ఎలాంటి పిచ్చి మొక్కలు ఉండకుండా ఎప్పటికప్పుడు పనులు చేపట్టాలని సూచించారు. పల్లె ప్రకృతి వనాలకు వాచర్లను(వన సంరక్షకులను) నియమించుకొని వారితో పని చేయించుకోలేకపోతున్నారని కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు.
బాగా చదువుకొని ప్రయోజకులు కావాలి
పల్లె ప్రకృతి వనం, హరితహారం నర్సరీ, వైకుంఠధామం, డంపింగ్ యార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన దోర్నాల్పల్లి పంచాయతీ కార్యదర్శి సురేశ్, టెక్నికల్ అసిస్టెంట్ నారాయణరెడ్డిని సస్పెండ్ చేశారు. పనుల పర్యవేక్షణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎంపీవో సోమలింగానికి మెమో జారీ చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. దోర్నాల్పల్లి పాఠశాల విద్యార్థులతో మాట్లాడారు. వారి సామర్థ్యాలను బోర్డుపై రాయించి తెలుసుకున్నారు. చదువు ఏకైక ఆయుధమని.. బాగా చదువుకొని ప్రయోజకులు కావాలని కలెక్టర్ తెలిపారు. ధాత్రి అనే విద్యార్థిని పేరు అడిగి అర్థం చెప్పమనగా భూమి అని సమాధానమివ్వగా కలెక్టర్ సంతోషం వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి పిల్లల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఆశావర్కర్ విధివిధానాలపై సూచనలిచ్చారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. దోమ తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలను సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు. గ్రామకంఠం భూమి అన్యాక్రాంతం అయిందని అయినాపూర్ గ్రామానికి చెందిన మల్లన్న కలెక్టర్కు ఫిర్యాదు చేయగా పరిశీలించమని తహసీల్దార్ను ఆయన ఆదేశించారు. ఎంపీడీవో కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి విధుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా పనులు పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ షాహెదాబేగం, ఎంపీడీవో జయరాం, ఏపీవో దస్తయ్య, ఏవో ప్రభాకర్రావు, అధికారులు పాల్గొన్నారు.