ఖిలావరంగల్ : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో దళారి వ్యవస్థను రూపుమాపేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ గోపి అన్నారు. శుక్రవారం వరంగల్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియపై రైతు సంఘాల నాయకులు, సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్ని మౌలిక సదుపాయాలు ఉండాలని, సంబంధిత అధికారులు వాటి యొక్క పూర్తి నివేదిక త్వరగా అందచేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు తమ సమస్యలు తెలుపేందుకు కేటాయించిన అధికారి ఫోన్ నంబరు నోటీసు బోర్డుపై ఏర్పాటు చేయాలన్నారు. ప్రతీ కేంద్రంలో ఒక ప్రత్యేకాధికారి నియామకం చేయాలన్నారు.
లీగల్ మెట్రాలజీ అధికారులు కేంద్రాల్లో వేయింగ్ మిషన్ పూర్తిగా పరిశీలించిన తర్వాత నివేదికను అందచేయాలన్నారు. గతేడాది సరిగా నిర్వహించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో రైతు సంఘాల నాయకులు రమేశ్, చల్లారావు, రవీందర్రెడ్డి, కుమారస్వామి, శంకరయ్య, శ్రీనివాస్ అదనపు కలెక్టర్ హరిసింగ్, డీఆర్డీఓ సంపత్రావు, డీసీఓ సంపీవరెడ్డి, మార్కెటింగ్ డీఎం భాస్కర్రావు, మార్కెట్ జనరల్ మేనేజర్ ప్రసాద్, జేడీ ఉషదయాల్, డీఎస్ఓ దుర్గభవాని పాల్గొన్నారు.