కొత్తూరు, జనవరి 19 : కొత్తూరు మండలంలోని జహంగీర్ పీర్ దర్గా ఉర్సులో భాగంగా తొలిరోజు గురువారం వక్ఫ్ బోర్డు చైర్మన్ మసియుల్లాఖాన్, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గంధాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లి సమాధులకు సమర్పించారు. గంధోత్సవాన్ని చూడటానికి వేలాది వచ్చిన భక్తులతో దర్గా పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి.
జహంగీర్ పీర్ దర్గా అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని వక్ఫ్బోర్డు చైర్మన్ మసియుల్లాఖాన్ స్పష్టం చేశారు. గంధోత్సవం అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. దర్గా అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గంధోత్సవాన్ని విజయవంతం చేసిన అన్ని శాఖల అధికారులను అభినందించారు.
సీఎం కేసీఆర్ జహంగీర్ పీర్ దర్గా అభివృద్ధికి అత్యంత ఆసక్తి చూపుతున్నారని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ చెప్పారు. దర్గా అభివృద్ధికి రూ.50 కోట్లు కేటాయించారని తెలిపారు అయితే కొన్ని సమస్యల వల్ల మాస్టర్ ప్లాన్ను అమలు కాలేదని.. సమస్యలన్నింటినీ పరిష్కరించి ప్లాన్ అమలు చేస్తామని చెప్పారు చిరువ్యాపారులకు భరోసా కల్పించి భూసేకరణ చేపడుతామని ఎమ్మెల్యే వివరించారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ ఫసియుద్దీన్, ఎంపీపీ మధుసూదన్రెడ్డి, షాద్నగర్ ఏసీపీ కుషాల్కర్, షాద్నగర్ మున్సిపల్ చైర్మన్ నరేందర్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు దేవేందర్యాదవ్, సత్యనారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ రవీందర్, కౌన్సిలర్ శ్రీనివాస్, సీఐ బాలరాజు, ఇన్ముల్నర్వ సర్పంచ్, ఉపసర్పంచ్, టీఆర్ఎస్ నాయకులున్నారు.