రంగారెడ్డి జిల్లాలో…
రంగారెడ్డి, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ) : ‘జిల్లా రైతాంగానికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన రుణమాఫీని సంపూర్ణంగా అమలు చేసేందుకు సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో రూ.లక్ష లోపు రుణాలను 1,47,075 మంది రైతులు రూ.300కోట్ల వరకు తీసుకున్నారు. ఇప్పటికే ప్రభుత్వం రూ.25వేల లోపు రుణంగా తీసుకున్న రూ.16.73కోట్లను తొలి విడుతలో మాఫీ చేసింది. రెండో విడుతలో రూ.50వేల లోపు తీసుకున్న రుణాలకు సంబంధించి రూ.31.14కోట్లను మాఫీ చేసింది. మిగతా వారికీ మాఫీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడంతో జిల్లాలో గురువారం నుంచే రుణమాఫీ ప్రక్రియ మొదలు కానున్నది. సెప్టెంబర్ రెండో వారంలోపుగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం అర్హుల జాబితాను రూపొందించనున్నది. దీంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది.’
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.లక్షలోపు రుణాలన్నింటినీ సెప్టెంబర్ రెండో వారం లోపుగా మాఫీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు 2014 ఏప్రిల్ 1 నుంచి 2018 డిసెంబర్ 11లోపు రుణం తీసుకున్న రైతులకు రుణమాఫీని సంపూర్ణంగా ప్రభుత్వం అమలు చేయనున్నది. మొదటి విడుత రుణమాఫీలో భాగంగా రూ.25వేల లోపు రుణం తీసుకున్న 10,940 మంది రైతులకు సంబంధించి రూ.16.73కోట్లను ప్రభుత్వం మాఫీ చేసింది. రెండో విడుతలో రూ.50వేల లోపు రుణం తీసుకున్న 24,013 మంది రైతులకు సంబంధించి 82.49కోట్ల రుణాల మాఫీ ప్రక్రియను మొదలుపెట్టింది. ఈ మేరకు 9,579 మందికి సంబంధించి రూ.31.14కోట్ల రుణాలను మాఫీ చేసింది. ఇంకా 14,434 మందికి సంబంధించి రూ.51.35 కోట్లను మాఫీ చేయాల్సి ఉన్నది. కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం వల్ల రుణమాఫీ ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. ఆగిపోయిన ఈ ప్రక్రియను తిరిగి ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం నెల పదిహేను రోజుల్లో మొత్తం రుణాలను మాఫీ చేయనున్నది. ఈ క్రమంలో గతంలో 50వేల లోపు రుణమాఫీలో మిగిలిపోయిన వారితోపాటు రూ.50 లక్షల నుంచి రూ.లక్ష లోపు రుణాలు తీసుకున్న వారితో కలిపి 1,26,556 మందికి సంబంధించి రూ.252కోట్ల వరకు తాజాగా రుణమాఫీ కానున్నది.
ఖుషీలో రైతాంగం..
ఎకరం నుంచి రెండున్నర ఎకరాల భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగించే కుటుంబాలు సగానికి పైనే ఉన్నారు. పంట రుణాల మాఫీ, రైతుబంధు, రైతు బీమా, సకాలంలో ఎరువులు, విత్తనాలు, నిరంతర విద్యుత్, సాగునీటి సౌకర్యం వంటి చర్యలతో జిల్లా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
వికారాబాద్ జిల్లాలో..
వికారాబాద్, ఆగస్టు 2, (నమస్తే తెలంగాణ) : రైతు సంక్షేమానికిగాను బీఆర్ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రైతు ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్నది. ఈ తొమ్మిదేళ్ల పాలనలో రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ వస్తున్నది. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు ఇచ్చిన మాట ప్రకారం వ్యవసాయానికి 9 గంటల విద్యుత్తును సరఫరా చేసిన రాష్ట్ర ప్రభుత్వం, రెండేండ్లలోనే విద్యుత్తు రంగంలో నవశకం మొదలైందనే విధంగా వ్యవసాయానికి ఉచిత నిరంతర విద్యుత్తును సరఫరా చేస్తున్నది. రైతుబంధు, రైతుబీమా పథకాలతోపాటు రూ.లక్ష రుణమాఫీని పూర్తి చేసిన ప్రభుత్వం,.. మరోసారి రూ.లక్ష రుణమాఫీలో భాగంగా ఇప్పటికే పెద్ద మొత్తంలో పంట రుణాలను మాఫీ చేసిన ప్రభుత్వం మిగతా పంట రుణాలను కూడా మాఫీ చేసేందుకు రాష్ట్ర సీఎం కేసీఆర్ గ్రీన్సిగ్నల్ ఇచ్చారు.
నేటి నుంచి 45 రోజుల్లోగా పంట రుణాలను మాఫీ చేసే ప్రక్రియ విడుతల వారీగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పంట రుణాల మాఫీ ప్రక్రియను విడుతల వారీగా సెప్టెంబర్ రెండో వారంలోగా పూర్తి చేయనున్నారు. పంట రుణాల మాఫీపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మా దేవుడు కేసీఆర్ అంటూ, జీవితాంతం రుణపడి ఉంటామంటూ రైతులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుల జీవితాల్లో వెలుగులు నిండాయని, సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలతో మాలో ధైర్యాన్నిచ్చిందని పేర్కొంటున్నారు. గతంలో అప్పుల్లో కూరుకుపోయి నానా అవస్థలు పడేదని తెలుపుతున్నారు. రాష్ట్రం సిద్ధించాక తొలుత అధికారం చేపట్టిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం రూ.లక్షలోపు పంట రుణాలను మాఫీ చేసిన ప్రభుత్వం మరోసారి రుణాలను మాఫీ చేసేందుకు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మాట నిలబెట్టుకుంటున్న ప్రభుత్వం..
అప్పుల ఉబిలో ఇరుక్కున్న రైతన్నను ఆదుకునేందుకుగాను రైతులకు ఇచ్చిన మాట ప్రకారం మొదటి దఫా రూ.లక్ష లోపు పంట రుణాలను మాఫీ చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం.. రెండో విడుత రుణమాఫీలో భాగంగా రూ.25 వేల లోపు రుణాలకు సంబంధించి 10,807 మంది రైతులకు సంబంధించిన రూ.16.24 కోట్ల రుణాలను, రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకుగల రుణాలకు సంబంధించి 27,628 మంది రైతులకు సంబంధించిన రూ.78.04 కోట్ల పంట రుణాలు ఉండగా, ఇప్పటివరకు రూ.40 వేల పంట రుణాల వరకు 32,000 మంది రైతులు తీసుకున్న రూ.94.65 కోట్ల వరకు ప్రభుత్వం మాఫీ చేసింది. రూ.లక్షలోపు పంట రుణాల మాఫీతో జిల్లాలోని 44,000 మంది రైతులు ప్రయోజనం పొందనున్నారు. జిల్లాలో రూ.లక్షలోపు రుణాలు సుమారుగా రూ.318 కోట్లు ఉన్నట్లు జిల్లా లీడ్ బ్యాంకు అధికారులు వెల్లడించారు. మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం మొదటిసారి అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకిచ్చిన మాట ప్రకారం రూ.705 కోట్ల రుణాలను నాలుగు విడుతలుగా మాఫీ చేసింది. ఒకేసారి పంట రుణాలను మాఫీ చేసేందుకుగాను రిజర్వుబ్యాంకు నిబంధనలు అడ్డుతగలడంతో విడతల వారీగా రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా కొంత ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ రుణమాఫీ ప్రక్రియను మాత్రం పూర్తి చేసి రైతు ప్రభుత్వంగా పేరొందింది. జిల్లాలో మొదటి దఫా రుణమాఫీకి సంబంధించి జిల్లావ్యాప్తంగా రూ.705 కోట్ల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. నాలుగేండ్లలో చేయాల్సిన రుణమాఫీని మూడేండ్లలో పూర్తి చేసి రైతు ప్రభుత్వంగా నిలిచింది. అయితే తొలి విడుత రుణమాఫీ ప్రక్రియతో జిల్లాలోని 1,42,336 మంది రైతులు ప్రయోజనం పొందారు.
వ్యవసాయ రంగం మరింత బలోపేతం
తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న ఆర్థ్థిక ఒత్తిడిని తగ్గించడానికి, వ్యవసాయ రంగాన్ని మరిత బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. పంట రుణమాఫీ చేయడం చాలా సంతోషం. రుణమాఫీతో అప్పుల బాధ ఆలోచనలు తొలగిపోతాయి. ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని అమలు చేయడం కేసీఆర్కు మాత్రమే సాధ్యం.
– ఏర్పుల బూవమ్మ, గ్రామం కోకట్, మండలం యాలాల
రైతుకు మరింత ఆసరాగా..
తెలంగాణ ప్రభుత్వం రూణమాఫీ ప్రకటించడం చాలా సంతోషంగా ఉన్నది. ఈ రుణమాఫీతో రైతులకు ఎంతో ఆసరా కానున్నది. ఇప్పటికే రైతుబంధు, రైతుబీమా, సబ్సిడీ ఎరువులు అందజేస్తూ అండగా నిలుస్తున్నారు. రైతులు అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యావాదాలు.
– లచ్చయ్య, ఎన్కతల, మోమిన్పేట
అన్నదాతల సంక్షేమానికి పెద్దపీట..
దేశంలో ఎక్కడలేని విధంగా రైతాంగ ప్రయోజనాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారు. ఆది నుంచి రైతులకు అధిక ప్రాధాన్యతనిస్తున్న ముఖ్యమంత్రి రైతు రుణమాఫీపై కీలక ప్రకటన చేయడం హర్షణీయం. సీఎం కేసీఆర్కు రైతులు రుణపడి ఉంటారు.
– మంచిరెడ్డి కిషన్రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే
సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి..
సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి. అనేక పథకాలు అమలు చేస్తూ అన్నదాతలకు అండగా నిలుస్తున్నారు. రైతుబంధు, రైతుబీమా, నిరంతర విద్యుత్ సరఫరా, సకాలంలో ఎరువులు, విత్తనాలు, పంపిణీ చేస్తున్నారు. రుణాలు కూడా మాఫీ చేస్తామని ప్రకటించడం సంతోషకరం.
– కొలన్ ప్రభాకర్రెడ్డి, జిల్లా రైతు బంధు సమితి సభ్యుడు(షాబాద్)
రైతులను రాజుగా మార్చేందుకే..
రైతుల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి కేసిఆర్ రైతులను రాజుగా మార్చేందుకే రైతు రుణమాఫీ ప్రక్రియను తిరిగి ప్రారంభించడం సంతోషించదగ్గ విషయం. నేటి నుంచి రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించాలని సీఎం సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలివ్వడం ఆనందంగా ఉన్నది.
– ఏ.నర్సింలు, రైతు రాఘవపూర్, పరిగి మండలం
రుణమాఫీ.. అభినందనీయం..
రైతుల రుణమాఫీ ప్రకటన అభినందనీయం. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతు బందు, రైతు బీమా వంటి పథకాలతో పాటు పలు సంక్షేమ పథకాలను అందజేస్తున్నది. రైతుల బాగు కోసం కృషి చేసే సీఎం కేసీఆర్కు రైతులంతా అండగా ఉంటారు.
-నారాయణ రైతు, కుత్బులపూర్, పూడూరు మండలం
రైతుల పాలిట దేవుడు కేసీఆర్..
అన్నదాతల సంక్షేమానికి నిరంతరం పాటుపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పాలిట దేవుడు. రుణమాఫీ కీలక ప్రకటన చేస్తూ నిర్ణయం తీసుకోవడం సంతోషకరం. గతంలో ఏ ప్రభుత్వాలు ఇంత శ్రద్ధ తీసుకోలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు.
– రవణమోని జంగయ్య, దండుమైలారం (ఇబ్రహీంపట్నంరూరల్)