బొల్లారం, జనవరి 3 : రాష్ట్రపతి భవనంలోని అందాలను వీక్షించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి సందర్శకులు, పాఠశాలల విద్యార్థులు మంగళవారం ఉదయం నుంచే తరలివచ్చారు. భవనం చుట్టూ ఉన్న పూలతోటలు, పండ్ల తోటలు, వాటర్ ఫాల్స్, అందమైన గార్డెన్ను వీక్షిస్తూ, సెల్ఫీలు దిగుతూ సరదాగా గడిపారు. రెండవ రోజు 325 మంది రాష్ట్రపతి భవనాన్ని సందర్శించినట్లు కార్యాలయ సిబ్బంది తెలిపారు.
రాక్ గార్డెన్, జలపాతం..!
రాష్ట్రపతి భవనంలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గత విడిది సమయంలో కొత్తగా ఏర్పాటు చేసిన రాతి వనం (రాక్ గార్డెన్) జలపాతం, పాలమాటం (జపాన్ మొక్కల తోట)ను ప్రారంభించారు. ఈ గార్డెన్లో జింకలు, పులుల బొమ్మలు యువతను, చిన్నారులను ఆకట్టుకున్నాయి. జలపాతం వద్ద సందర్శకులు సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు.
నక్షత్ర వాటిక
రాష్ట్రపతి నిలయంలోని నక్షత్రవాటికను 2013 డిసెంబర్లో ఏర్పాటు చేశారు. అప్పుడు శీతాకాల విడిది సమయంలో ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించారు. ఎకరన్నర స్థలంలో వలయాకారంలో చూడముచ్చటగా ఉన్న ఈ నక్షత్ర వాటికను చూసి సందర్శకులు మురిసిపోయారు.
ఔషధ వనం
రాష్ట్రపతి భవన్లో 2010లో అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఔషధ వనం ఏర్పాటు చేశారు. ఐదెకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఔషధ వనంలోని 116 మొక్కలు సందర్శకులను ఆకట్టుకున్నాయి.
సొరంగ మార్గం
సొరంగ మార్గం ఇక్కడ ప్రత్యేక ఆకర్శణగా నిలుస్తున్నది. వంటశాల నుంచి 50 మీటర్ల పొడవు ఉన్న సొరంగ మార్గం ద్వారా రాష్ట్రపతి డైనింగ్ రూమ్కు ఇప్పటికీ భోజనం తీసుకువెళ్లడం విశేషం.