పరిగి, మే 8 : వేసవికాలం వచ్చిందంటే చాలు ఎండల తీవ్రత పెరుగడంతోపాటు అందుకనుగుణంగా భూగర్భజలాలు అడుగంటిపోతాయి. ఎండాకాలంలో నీటి కోసం ఇబ్బందులు, కరెంటు కోతలు ఇవన్నీ గతం. ప్రస్తుతం 40 డిగ్రీల కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ప్రస్తుత తరుణంలోనూ వికారాబాద్ జిల్లా పరిధిలో భూగర్భ జలమట్టం తక్కువ లోతులోనే ఉండడం గమనార్హం. జిల్లా పరిధిలోని బోర్లలో ఏప్రిల్ నెలలో సేకరించిన నీటి మట్టాల ఆధారంగా జిల్లా సరాసరి భూగర్భ జలమట్టం 12.83 మీటర్లు ఉండగా.. యాలాల మండలం ఎన్కేపల్లిలో భూగర్భ జలాలు కేవలం 1.60 మీటర్లలోనే ఉండడం గమనార్హం. ఇందుకు ప్రధాన కారణం వర్షాకాలంలో సమృద్ధిగా వర్షాలు కురువడంతోపాటు మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణతో నీటి నిలువ సామర్థ్యం పెరుగడం ద్వారా నీరు నిలువ ఉంటుండడంతో భూగర్భ జలమట్టాలు సైతం అదే స్థాయిలో ఉంటున్నాయి. జిల్లాలో 1179 చెరువులు, కుంటలు ఉండగా ప్రస్తుత వేసవిలోనూ చెరువుల్లో నీళ్లున్నాయి. గతంలో వేసవి వచ్చిందంటే చెరువులు పూర్తిగా ఎండిపోయేవి. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ చక్కటి ఫలితాలు ఇచ్చిందనడానికి ఇదో నిదర్శనం. ఇంత ఎండాకాలంలో సైతం 24 గంటలు విద్యుత్ నిరంతరాయంగా సరఫరా జరుగుతుండగా బోర్ల కింద వివిధ పంటల కోసం నీరు వాడుతున్నారు. జిల్లాలో 66,423 వ్యవసాయ బోర్లు ఉండగా, మంచినీటి సరఫరా బోర్లు 2,997 ఉన్నాయి. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో బావులున్నాయి. ఈ బోర్లలో నీటిమట్టాలను అధికారులు పరిశీలించగా ఇప్పటికీ భూగర్భ జలాలు తగ్గకపోవడం గమనార్హం.
జిల్లాలో 39 ప్రాంతాల్లో నీటిమట్టాల సేకరణ
వికారాబాద్ జిల్లాలో భూగర్భ జల వనరుల శాఖ అధికారులు ప్రతి నెల భూగర్భ జలాల మట్టాలను సేకరిస్తారు. ప్రతి నెల మూడో వారం తర్వాత భూగర్భ జల మట్టాన్ని పరిశీలించి ఆయా మండలాలవారీగా, జిల్లావారీగా సరాసరి భూగర్భ జలమట్టం నిర్ణయిస్తారు. ఏప్రిల్ నెలలో 39 ప్రాంతాల్లో భూగర్భ జలాలను పరిశీలించారు. జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో ఎంపిక చేసిన ప్రాంతాల్లోని బోర్లలో భూగర్భ జలమట్టాలను సంబంధిత శాఖ అధికారులు సేకరించారు. ఇందులో అత్యల్పంగా యాలాల మండలం ఎన్కేపల్లిలో 1.60 మీటర్ల లోతులోనే భూగర్భ జలాలు ఉండడం గమనార్హం. జిల్లా పరిధిలో అత్యధికంగా దోమ మండలం దిర్సంపల్లిలో 42.32 మీటర్లుగా భూగర్భ జలమట్టం నమోదైంది. ఇదిలావుండగా ప్రతి మండలంలో కనీసం రెండుకు తగ్గకుండా భూగర్భ జలాల మట్టం పరిశీలించిన అధికారులు గణాంకాలు క్రోడీకరించి నీటి మట్టం వివరాలు ప్రకటించారు.
సమృద్ధిగా భూగర్భ జలాలు : జి.దీపారెడ్డి, వికారాబాద్ జిల్లా భూగర్భ జల అధికారి
జిల్లా పరిధిలో ఈసారి వర్షాలు సమృద్ధిగా కురువడం ద్వారా భూగర్భ జల మట్టం బాగున్నది. జిల్లాలోని చెరువుల్లో సైతం నీళ్లు ఉన్నాయి. భూగర్భ జలమట్టం మరింత వృద్ది చేసేందుకు ఎక్కడికక్కడే చెక్డ్యామ్లు, పర్కులేషన్ ట్యాంకుల నిర్మాణం చేపడితే బాగుంటుంది. వాగులపై చెక్డ్యామ్ల నిర్మాణంతో వర్షపు నీరు ఎక్కడికక్కడే భూమిలోకి ఇంకిపోయి భూగర్భ జలాలు మరింత పెరుగుతాయి.