పరిగి, ఏప్రిల్ 26: హరితహారంలో పెద్ద ఎత్తున మొక్కలను నాటి జిల్లాను గ్రీన్ వికారాబాద్గా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీఎంవో ప్రత్యేకాధికారి ప్రియాంక సూచించారు. మంగళవారం 2022-23 సంవత్సరానికి హరితహారంలో భాగంగా వికారాబాద్ జిల్లాలో చేపట్టాల్సిన పనులపై కలెక్టర్ నిఖిలతో కలిసి ఆమె డీపీఆర్సీ భవనంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేయొద్దని.. అన్ని గ్రామాలు పచ్చదనంతో కళకళలాడాలన్నారు. గ్రామాల్లో వ్యక్తుల పుట్టిన రోజును పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటేలా లేదా మొక్కలను దత్తత తీసుకునేలా.. మొక్కలకు పిల్లల పేర్లు పెట్టేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శులకు ఆమె సూచించారు. జిల్లా సరిహద్దు నుంచి రోడ్లకు ఇరువైపులా రెం డు వరుసల్లో పెద్ద ఎత్తున మొక్కలను నాటాలన్నారు. రోడ్లకు ఇరువైపులా మొక్కలను నాటేందుకు ఎన్ని మొక్కలు అవసరమవుతాయో అంచనాలను రూపొందించి నివేదికలను సమర్పించాలని అధికారులను ఆమె ఆదేశించారు.
మొక్కలు సరిపడా లేకపోతే హెచ్ఎండీఏ నుంచి అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా పరిధిలోని నాలుగు మున్సిపాలిటీలకు కావాల్సిన మొక్కల వివరాల నివేదికలను రెండు రోజుల్లో పంపించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఆవరణల్లోనూ పెద్ద ఎత్తున మొక్కలను నాటించడంతోపాటు పాఠశాలల ఆవరణల్లో మొక్కలను నాటడంతోపాటు తరగతి గదులకు మంచి కొటేషన్లు రాయించాలని, బొమ్మలు వేయించాలని ఆమె సూచించారు.
పంచాయతీ కార్యదర్శులకు అవార్డులు
హరితహారంలోని లక్ష్యాలను అధిగమించిన, బాగా పనిచేసిన పంచాయతీ కార్యదర్శులకు అవార్డులను అందిస్తామని సీఎంవో ప్రత్యేకాధికారి ప్రియాంక తెలిపారు. హరితహారం కింద జరుగుతున్న పనులను ఎప్పటికప్పుడు అటవీశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలన్నారు. జిల్లాలోని 566 నర్సరీలను సందర్శించే ముందు రోజు సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులకు అధికారులు సమాచారం అందించాలని సూచించారు. నర్సరీ ఇన్చార్జి అధికారుల జాబితాలను గ్రామపంచాయతీలకు పంపించాలని, అధికారి పేరు పంచాయతీ బోర్డులో ప్రదర్శించాలన్నారు. మొక్కల సంరక్షణకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశం లో జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్, డీఆర్డీవో కృష్ణన్, జడ్పీ సీఈవో జానకీరెడ్డి, జిల్లా అటవీశాఖ అధికారి వేణుమాధవ్, జిల్లా పంచాయతీ అధికారి మల్లారెడ్డి, జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ విమల, జిల్లా పౌర సరఫరాల అధికారి రాజేశ్వర్, జిల్లా వ్యవసాయాధికారి గోపాల్, డీఈవో రేణుకాదేవి, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీవోలు, ఏపీవోలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
మొక్కల పెంపకం చాలా బాగుంది
వికారాబాద్, ఏప్రిల్ 26: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సీఎంవో ప్రత్యేకాధికారి ప్రియాంక అన్నారు. మంగళవారం ఆమె వికారాబాద్ మున్సిపాలిటీలోని నర్సరీ, అదేవిధంగా నారాయణపూర్ గ్రామంలోని నర్సరీని సందర్శించి పరిశీలించారు. మొక్కల పెంపకం చాలా బాగుందని మెచ్చుకున్నారు. అలాగే వికారాబాద్ సెంట్రల్ నర్సరీని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. నర్సరీల నిర్వహణపై పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ ఇవ్వాలని అటవీశాఖ అధికారిని ఆదేశించా రు. అటవీశాఖ నర్సరీలో ఉన్న పెద్ద, పెద్ద మొ క్కలను వికారాబాద్ పట్టణంలో నాటించాలన్నారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.