మర్పల్లి, ఏప్రిల్ 26: పర్యావరణ పరిరక్షణతోనే మానవ మనుగడ ముడిపడి ఉంది. రాష్ట్రంలో 24 శాతం ఉన్న ఆటవీ ప్రాతాన్ని 33శాతం పెంచడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. ప్రతి సంవత్సరం హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తున్నది. మండలంలోని నర్సాపూర్ పెద్ద తండా పాఠశాల, పంచాయతీ కార్యాలయ ఆవరణలో వివిధ రకాల మొక్కలతో పచ్చదనం ఉట్టిపడుతున్నది. ఇందులో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తండావాసులను భాగస్వాములు అయ్యారు. పాఠశాల ఆవరణ నల్లమట్టి, పశువుల ఎరువుతో సారవంతమైన మట్టిని తయారు చేసి మొక్కలు నాటారు. మొక్కలకు రక్షణగా పాఠశాల ఆవరణలో జాలి ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. దీంతో మొక్కలు ఏపుగా పెరుగడంతో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది.
ఆదర్శంగా మొక్కలు పెంపకం
నర్సాపూర్ తండాను మొక్కల పెంపకంలో ఆదర్శంగా నిలిచేందుకు తండావాసులు పనిచేస్తున్నారు. పాఠశాల ఆవరణ, గ్రామపంచాయతీ ఆవరణ పూర్తిగా మొక్కలను నాటి రక్షణ చర్యలు చేపట్టారు. పల్లె ప్రగతిలో రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటి వాటి సంరక్షణకు ట్రీగార్డులను ఏర్పాటు చేసి ట్యాంకర్లతో నీళ్లు పట్టిస్తున్నారు.
మొక్కల సంరక్షణకు ప్రాధాన్యత
పచ్చని చెట్లతో స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. నేను వ్యవసాయ కుటుంబంలోనే పుట్టాను. తండాకు మొదటిసారి సర్పంచ్ అయ్యే అవకాశం వచ్చింది. తండా పెద్దలతో రోడ్ల పక్కన, పాఠశాల ఆవరణలో మొక్కలను పెంచుతున్నాం. నిత్యం మొక్కలను పరిశీలించి నీళ్లు పడుతున్నాం.
-ధరమ్సింగ్, సర్పంచ్ నర్సాపూర్తండా