పరిగి, జూన్ 23 : పరిగిని సుందర పట్టణంగా తీర్చిదిద్దుదామని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. బుధవారం మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ అధ్యక్షతన జరిగిన పరిగి మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే మహేశ్రెడ్డి మాట్లాడుతూ పట్టణ పరిధిలో రూ.10కోట్ల విలువ చేసే పనులు కొనసాగుతున్నాయని, మిగతా రూ.5కోట్లతో పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని చెప్పారు. ప్రతి వార్డులో ప్రాధాన్యతా క్రమంలో పనులకు నిధుల కేటాయించాలన్నారు. పట్టణంలోని మినీ స్టేడియం, రెండు ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేస్తామన్నారు. జూలై ఒకటో తేదీ నుంచి ప్రారంభమయ్యే పట్టణ ప్రగతిలో భాగంగా పట్టణంలోని అన్ని వార్డుల్లో పారిశుద్ధ్యం, పచ్చదనంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. పార్కుల్లో సుందరీకరణ పనులు పూర్తి చేయాలని, ఆకర్షణీయమైన మొక్కలు నాటాలని ఎమ్మెల్యే తెలిపారు. చెత్త సేకరణ వ్యవస్థను మరింత పటిష్టవంతం చేయాలని, రోడ్లపై చెత్త తొలగింపునకు చర్యలు చేపట్టాలన్నారు. మిషన్ భగీరథ పనులు పూర్తి చేయడంతోపాటు నీటి సరఫరా జరిగేలా చూడాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. నాలాల్లో సిల్ట్ను తొలిగించాలని, ప్రతి వార్డులోను అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, వైస్ చైర్పర్సన్ కె.ప్రసన్నలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్కుమార్, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.
సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దాలి
గ్రామాలను సమస్యలు లేనివిధంగా తీర్చిదిద్దాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. బుధవారం కులకచర్ల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ సత్యమ్మ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తున్నదని, సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దాలని సూచించారు. జూలై1నుంచి ప్రభుత్వం పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుడుతుందని, ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ఆదర్శగ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమష్టిగా కృషిచేయాలని అన్నారు. ఈ సందర్భంగా పలువురు సర్పంచులు ఎంపీటీసీలు పలుసమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. పల్లె ప్రగతి ద్వారా పూర్తి చేసిన పనులను వారం రోజుల్లో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.
పల్లె ప్రగతిలో అసంపూర్తిగా ఉన్న పనులను వెంటనే పూర్తిచేయాలని అన్నారు. వ్యవసాయశాఖ సమీక్షలతో వ్యవసాయాధికారి వీరస్వామి మాట్లాడుతూ మండలంలో రైతులకు కావల్సిన విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచామని, ఫర్టిలైజర్ దుకాణాల్లో కొనుగోలు చేసుకోవాలని సూచించారు. బండవెల్కిచర్ల గ్రామంలో పల్లె ప్రకృతి వనం కోసం భూమిని గ్రామంలోనే చూయించాలని సర్పంచ్ శిరీష ఎమ్మెల్యేను కోరారు. స్థలాన్ని గుర్తించి త్వరగా మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి ఆదేశించారు. ఎంపీపీ సత్యమ్మ మాట్లాడుతూ మండలంలో జరిగే ప్రతి పనికి సంబంధించిన సమాచారం తమకు అందజేయాలని అన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ రాందాస్నాయక్, వైస్ ఎంపీపీ రాజశేఖర్గౌడ్, ఎంపీడీవో నాగవేణి, ఈవోఆర్డీ సుందర్, వివిద గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు, వివిద శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఉద్యానవన పంటల సాగుతో లాభదాయకం
ఉద్యానవన పంటల సాగుతో రైతులకు లాభదాయకంగా ఉంటుందని ఎమ్మెల్యే మహేశ్రెడ్డి అన్నారు. బుధవారం దోమ మండల పరిధిలోని అయినాపూర్ గ్రామ రైతు జోగు నర్సింహులు రెండెకరాల పొలంలో బొప్పాయి మొక్కలు నాటే కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఉద్యాన శాఖ డివిజన్ అధికారి సంతోషి, రైతు నర్సింహులు ద్వారా బొప్పాయి సాగు విధానం పెట్టుబడి, రాబడి వంటి వివరాలను ఎమ్మెల్యే మహేశ్రెడ్డి అడిగి తెలుసుకున్నారు. నూతన వ్యవసాయ పద్ధతులైన డ్రిప్ ఇరిగేషన్, మల్చింగ్ విధానం తదితర పద్ధతులను వినియోగించాలన్నారు. ఉద్యానవన పంటలను సాగు చేసి లాభాలను పొందే దిశగా రైతులు అడుగులు వేయాలని సూచించారు. ప్రభుత్వం ద్వారా రాయితీలను పొందవచ్చన్నారు. కార్యక్రమంలో జడ్పిటీసీ నాగిరెడ్డి, దోమ మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు రాజిరెడ్డి, అయినాపూర్ సర్పంచ్ మల్లేశ్, టీఆర్ఎస్ నాయకుడు రాఘవేందర్రెడ్డి, గ్రంథాలయ డైరెక్టర్ యాదయ్యగౌడ్, ఉద్యాన శాఖ డివిజన్ అధికారి సంతోషి, ఏఈవో కావ్య, ఏపీవో వెంకటేశ్, లక్ష్మణ్, రైతులు, ఎల్లప్ప, వెంకటయ్య పాల్గొన్నారు.