వికారాబాద్, మే 4 :వికారాబాద్ మండల పరిధిలోని ఎర్రవల్లి గ్రామంలో 600 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని మంగళవారం ఓ పత్రికలో (నమస్తే తెలంగాణ కాదు) కథనం వచ్చింది. ఈ వచ్చిన కథనానికి జిల్లా వైద్యా ఆరోగ్య శాఖ యంత్రాంగం కదిలింది. జిల్లా కలెక్టర్తో పాటు ఎమ్మెల్యే, వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు అవాక్కయ్యారు. ఉదయం 9 గంటలకే అధికారులు అందరూ గ్రామానికి చేరుకున్నారు. గ్రామంలో 1400 మంది జనాభా, 600 మందికి కరోనా పాజిటివ్ కేసులు అని ప్రచురణ కావడంతో ఒక్కసారి ప్రజలు అయోమయానికి గురయ్యారు. దీనికంతటికి కారణం ఆ గ్రామానికి చెందిన ఓ విపక్ష నాయకుడే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. మంగళవారం ఉదయం ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, వైద్యాధికారులు, పంచాయతీ అధికారులతో కలసి గ్రామానికి వెళ్లి ఎన్ని కరోనా కేసులు ఉన్నాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుధాకర్షిండేను అడుగగా, గ్రామంలో 30 కరోనా కేసులు ఉండగా వారిలో ఇద్దరు మరణించారని, 28 మంది హోం ఐసోలేషన్లో ఉన్నారని, వారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని తెలిపారు. ప్రతి రోజు స్థానిక ఏఎన్ఎం అరుణ, ఆశవర్కర్లు కరోనా బారిన పడ్డ వారి ఇంటికి వెళ్లి మందులు ఇస్తున్నారని ఎమ్మెల్యేకు తెలిపారు.
అత్యవసరమైతేనే బయటకు రావాలి
గ్రామంలోని ప్రజలందరూ అత్యవసరమైతేనే బయటకు రావాలి. అనవసరంగా బయటకు వచ్చి కరోనా మహమ్మారి బారిన పడొద్దు. తగు జాగ్రత్తలు తీసుకోవాలి. భౌతిక దూరం పాటిస్తూ మాస్కును ధరించాలి.