బషీరాబాద్ : మండల పరిధిలోని మైల్వార్ గ్రామానికి చెందిన రైతు ఘణపురం కుర్వ శ్యామప్ప తనకున్న ఏడెకరాల్లో పెసర పంటను సాగు చేశాడు. సాగు చేసిన ఏడెకరాల్లో పంట మంచిగా రావడంతో రూ. 25వేలు పెట్టి కూలీలతో కలుపు తీయించాడు. పంట ఏపుగా పెరగడంతో పూత, కాత కోసం అవసరమైన మందులు పిచికారీ చేశాడు. అయితే కోత సమయం వచ్చినప్పటికీ పంటకు పూత, కాత రాకపోయేసరికి నష్ట పోయినట్లు గుర్తించి ఆందోళన చెందాడు.
ఈ సందర్భంగా రైతు మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రం, సేడం తాలుకా నుంచి 30కిలోల పెసర విత్తనాలు తెచ్చి ఏడున్నర ఎకరాల్లో సాగు చేసినట్లు తెలిపారు. మొదట పంట బాగా వచ్చినప్పటికీ పూత, కాత రాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కల్తీ విత్తనాలను అందజేసిన దుకాణంపై దాడులు చేసి తగిన న్యాయం చేయాలని రైతు కోరాడు.