తాండూరు రూరల్, డిసెంబర్ 14 : జిల్లాలో గత ఏడాది కంటే ఈ ఏడాది నేరాల సంఖ్య తగ్గిందని వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. బుధవారం తాండూరు రూరల్ సర్కిల్ కార్యాలయంలో రికార్డులను తనిఖీ చేయడంతోపాటు కరణ్కోట పోలీసు స్టేషన్లో సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. గత ఏడాది రోడ్డు ప్రమాదాలు 260 జరుగగా, ఈ ఏడాది 200 మాత్రమే జరిగాయని వివరించారు. ఎన్ఫోర్స్మెంట్ దాడుల్లో 550 కేసులు నమోదైనట్లు తెలిపారు. అందులో 150 టాస్క్ఫోర్స్ కేసులు ఉన్నాయన్నారు. గత ఏడాది దొంగతనాలు 250 జరుగగా, ఈ ఏడాది 235 కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ కేసులు గత ఏడాది 54 కేసులు నమోదు కాగా.. ఈసారి 34 కేసులు నమోదైనట్లు చెప్పారు. హత్యలు గత ఏడాది 35, ఈసారి 26, గత ఏడాది అత్యాచారాలు 76, ఈ ఏడాది 57, మహిళల కేసులు గత ఏడాది 365, ఈ ఏడాది 300 నమోదైనట్లు తెలిపారు.
తాండూరు సబ్ డివిజన్లో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉందని, దీన్ని అధిగమించేందుకు యత్నిస్తున్నామని తెలిపారు. ప్రధాన కూడళ్లలో సిగ్నల్ వ్యవస్థను పునరుద్ధరించేందుకు మున్సిపల్ అధికారుల సమన్వయంతో ముందుకెళతామని పేర్కొన్నారు. కరణ్కోట పోలీస్స్టేషన్ను తాండూరు రూరల్ పోలీస్స్టేషన్గా మార్చేందుకు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపుతామని ఎస్పీ తెలిపారు. సమావేశంలో డీఎస్పీ శేఖర్గౌడ్, సీఐ రాంబాబు, ఎస్సీ మధుసూదన్రెడ్డి, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ ఎస్సైలు ఉన్నారు.
కరణ్కోట, పెద్దేముల్, యాలాల పోలీస్స్టేషన్ల పరిధిలోని సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన మల్కాపూర్ సర్పంచ్ విజయలక్ష్మి, గాజీపూర్ సర్పంచ్ వీరప్పముదిరాజ్, హాజీపూర్ సర్పంచ్ రవీందర్ను ఎస్పీ కోటిరెడ్డి సన్మానించారు.
ప్రమాదాలపై అప్రమత్తత అవసరం
పోలీసు యంత్రాంగం ప్రమాదాలపై అప్రమత్తత పాటించడంతో నివారణ చర్యలను పూర్తిస్థాయిలో తీసుకోవాలని ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. బుధవారం తాండూరులో సబ్ డివిజన్ పరిధిలోని పోలీసు అధికారులు, పోలీసు సిబ్బందితో ఏర్పాటు చేసిన వార్షిక నేర సమీక్షా సమావేశంలోముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రోడ్ సేఫ్టీ, షీ టీమ్స్, 100 డయల్, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సీసీ టీవీల ఏర్పాటుపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. నిషేధిత వస్తువుల అక్రమ రవాణా నివారించేందుకు ప్రతి నెల రెండుసార్లు కార్డన్ పెర్చ్ నిర్వహించాలన్నారు.