వికారాబాద్ : ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు ఈ నెల 1 నుంచి ప్రారంభించడం జరిగిందని, ప్రతి రోజు విద్యార్థుల హాజరు శాతం పెంచేలా తల్లిదండ్రుల్లో ప్రేరణ కలిగించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, జిల్లా విద్యాశాఖ అధికారి రేణుకాదేవిలతో కలిసి ఎంపీడీవోలు, ఎంఈవోలతో పాఠశాలల్లో కొవిడ్ నియంత్రణలో భాగంగా చేపట్టాల్సిన చర్యలపై గూగుల్ మీట్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి రోజు తప్పనిసరిగా సోడియం హైపోక్లోరైడ్తో తరగతి గదులు, బెంచీలు పరిశుభ్రం చేయించాలని డీపీవో, ఎంపీవోలను ఆదేశించారు.
మరుగుదొడ్ల వద్ద లైజాల్తో స్ప్రే చేసి శుభ్రం చేయించాలన్నారు. మధ్యాహ్న భోజనం నమయంలో తప్పకుండా సామాజిక దూరం పాటించాలన్నారు. ఒకే దగ్గర అందరూ గుమిగూడకుండ విడి విడిగా భోజనాలు చేయించాలని తెలిపారు. విద్యార్థులు చేతులు కడుక్కునే స్థలంలో నీరు నిలువకుండా చూడాలని, అవసరమైతే ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. భోజన సమయంలో తప్పనిసరిగా సబ్బుతో చేతులు కడుక్కొనే విధంగా ప్రధానోపాధ్యాయులు చూడాలన్నారు. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా మాస్కు వేసుకొనే విధంగా ఉపాధ్యాయులు పూర్తి శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు. ఇక నుంచి ప్రతి రోజు పాఠశాలలను తనిఖీ చేస్తానని, ఎలాంటి లోపం ఉన్న సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
జిల్లా వైద్యశాఖ అధికారి, విద్యాశాఖ అధికారి సహాకారంతో అన్ని పాఠశాలలకు ఆశ, అంగన్వాడీలను నియమించడం జరిగిందన్నారు. గేటు వద్దనే ప్రతి విద్యార్థికి ఫీవర్ చెక్ పరీక్షలు నిర్వహించాలని, ఎవరైనా విద్యార్థికి అనారోగ్యంగా ఉంటే పాఠశాలలో గల ఐసోలేషన్ గదిలో ఉంచి వైద్య బృందం ద్వారా అవసరమైన టెస్టులు చేయించాలని తెలిపారు. వ్యాధి నిర్ధారణ అయితే వెంటనే అన్ని ప్రథమ చికిత్సలు, మందులు అందించి వాహనములో సురక్షితంగా ఇంటి వద్ద దింపిరావాలన్నారు. జిల్లాలో మొత్తం 27 వ్యాక్సినేషన్ సెంటర్లు ఉన్నాయని, 18సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ప్రైవేటు సిబ్బంది సహాయంతో వ్యాక్సినేషన్ చేయించాలని సూచించారు. జిల్లాలో అవసరమైన 47వేల మాస్కులను జీపీ నిధులతో స్వయం సహాయక గ్రూపు మహిళలతో చేయించి సోమవారం వరకు అందించాలని డీఆర్డీవోను ఆదేశించారు.
విద్యార్థుల తల్లిదండ్రులు మనపై పూర్తి నమ్మకంతో వారి పిల్లలను పాఠశాలకు పంపడం జరుగుతుందని, ఇట్టి విషయంలో నిర్లక్ష్యం వహించకుండా పూర్తి జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. పాఠశాలల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మండల స్థాయి అధికారులు ఎంపీడీవోలు, తాసిల్దార్, ఎంపీవోలు, జిల్లా కలెక్టర్ అనుమతితో సెలవుపై వెళ్లేలా చూడాలని జిల్లా అదనపు కలెక్టర్కు సూచించారు. పాఠశాలల్లో మంచి వాతావరణం కొరకు పెద్ద ఎత్తున మొక్కలు నాటాలన్నారు. ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్ స్కీం కింద నాటిన ప్రతి మొక్కకు సంరక్షణ కోసం వాచ్ అండ్ వార్డుకు నెలకు రూ. 5 చొప్పున మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఎక్కువ మొత్తంలో మొక్కలు నాటితే ఒకరి జీవనోపాధి లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.