వికారాబాద్, నవంబర్ 29 : పోలింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. బుధవారం వికారాబాద్ మెరీనాట్ స్కూల్లో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా పోలింగ్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ… పోలింగ్ను పకడ్బందీగా నిర్వహించాలని, విధులను నిర్వహించే అధికారులందరూ సమష్టిగా పని చేయాలన్నారు. సామగ్రిని తీసుకెళ్లిన వెంటనే తమ పోలింగ్ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలను సమకూర్చుకోవాలని తెలిపారు. ఏవైనా సమస్యలు ఉంటే నోడల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలన్నారు. పోలింగ్ రోజున సిబ్బంది ఉదయం ఐదు గంటలకు కేంద్రాల్లో ఉం డాలని, ఉదయం 5-30 గంటలకు మాక్ పోలింగ్ కచ్చితంగా నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం సీఆర్సీ చేసి, వీ ప్యాట్ల నుంచి స్లిప్పులను తొలగించి మాక్ పోలింగ్ సర్టిఫికెటు ఇవ్వాలని తెలిపారు. ఉదయం ఏడు గంటలకు తప్పనిసరిగా పోలింగ్ను ప్రారంభించాలన్నారు.
పోలింగ్ క్రమంలో రెండు గంటలకోసారి కచ్చితమైన రిపోర్టును ఇవ్వాలన్నారు. ఎలాంటి తప్పిదాలు జరగకుండా ఏమైనా సమస్యలు ఉంటే సెక్టోరల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని సూచించారు. రీపోలింగ్కు ఆస్కారం లేకుండా సమన్వయంతో విధులు నిర్వహించాలని తెలిపారు. పోలింగ్ ప్రక్రియలో ఏవైనా సందేహాలు ఉంటే ఎన్నికల కమిషన్ ఇచ్చిన హ్యాండ్ బుక్ను చదువుకుంటూ పని చేయాలన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న వివిధ శాఖల సిబ్బంది కూడా అప్రమత్తంగా విధులు నిర్వహించాలన్నారు. పోలింగ్ సామగ్రి పంపిణీ ప్రక్రియను సాధారణ ఎన్నికల పరిశీలకులు సుధాకర్ పరిశీలించారు. కార్యక్రమంలో వికారాబాద్ రిటర్నింగ్ అధికారి రాహుల్ శర్మ, ట్రైనీ కలెక్టర్ అమిత్ నారాయణ, స్వీప్ నోడల్ అధికారి మల్లేశం, పంచాయతీరాజ్ ఈఈ ఉమేశ్, జడ్పీ డిప్యూటీ సీఈవో సుభాషిణి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి లక్ష్మీనారాయణ, ఎంపీడీవో సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
తాండూరు: తాండూరు నియోజకవర్గంలో గురువారం జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధిత అధికారులు బుధవారం సాయంత్రం వరకు సర్వం సిద్దం చేశారు. ఎన్నికల నిర్వాహణ సిబ్బందితో పాటు పోలీస్ సిబ్బంది తాండూరు పట్టణంలోని సెయింట్మార్స్ పాఠశాల నుంచి సంబంధిత అధికారులు కేటాయించిన పోలింగ్ బూత్లకు ప్రత్యేక వాహనాల్లో వెళ్లారు. తాండూరు అసెంబ్లీలో 269 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తాండూరు అసెంబ్లీ ఎన్నికల అధికారి శ్రీనివాస్రావు తెలిపారు. అందుల్లో మొత్తం 2 లక్షల 31 వేల 145 మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడించారు. ఇందుల్లో స్త్రీలు 1,18,567 పురుషులు 1,12,572, ట్రాన్స్జండర్లు ఆరుగురు ఉన్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు జరుగుతాయని, ఓటర్లు పోలింగ్ కేంద్రానికి ఏదైన ఒక గుర్తింపు కార్డును తీసుకొని సకాలంలో ఓటును వినియోగించుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాం టి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ శేఖర్గౌడ్ తెలిపారు. సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఎన్నికల నియమాలను ఉల్లంఘిస్తే ఎంతటివారైనా చర్యలు తప్పవవన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని అధికారులు కోరారు.
పెద్దేముల్ : అసెంబ్లీ ఎన్నికలకు మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఆయా గ్రామాల్లో మొత్తం 46 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. మండలంలో మొత్తం 38,807 మంది ఓటర్లు ఉండగా స్త్రీలు 19,812 మం ది , పురుషులు 18,994 మంది, ట్రాన్స్జెండర్ ఒకరు ఉన్నారు. మండలంలో గాజీపూర్లో ఉమెన్ మ్యానెజుడ్ పోలింగ్ స్టేషన్, బుద్దారం గ్రామంలో మోడల్ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక ఎస్ఐ ఎం.కాశీనాథ్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు కొనసాగుతున్నది.
మోమిన్పేట: మోమిన్పేట మండలంలో 48 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. బుధవారం సాయంత్రం ఎన్నికల అధికారులు ఈవీఎం, ఎన్నికల సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. మండలంలో మొత్తం 37,707 ఓట్లు ఉన్నాయి. పురుషులు 18,866, మహిళలు 18,641 ఉన్నారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు 110 మంది పోలీస్ అధికారులు పని చేస్తున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
కులకచర్ల: కులకచర్ల మండలంలో 47 పోలింగ్ కేంద్రాలకు 188మంది పోలింగ్ సిబ్బందిని కేటాయించినట్లు మండల అదనపు ఎన్నికల అధికారి మురళీధర్ తెలిపారు. వీరితో పాటు ఐదుగురు అధికారులను అదనంగా కేటాయించినట్లు తెలిపారు. గ్రామాల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. చౌడాపూర్ మండలంలో పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మండల అధనపు పోలింగ్ అధికారి ప్రభు తెలిపారు. మండలంలో 29 పోలింగ్ కేంద్రాలకు గాను 116మంది పోలింగ్ సిబ్బందిని నియమించినట్లు తెలిపారు.
మర్పల్లి: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మర్పల్లి, బంట్వారం మండలాల్లోని అన్ని గ్రామాలలో పోలీంగ్ కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.. మర్పల్లి మండలంలో 58, బంట్వారం మండలంలో 24 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.. మర్పల్లి మండల కేంద్రంతో పాటు బిల్కల్ లో మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి అన్ని ఏర్పాట్లు చేశారు.