పరిగి : ప్రతి గ్రామ పంచాయతీలో రోజుకు కనీసం 30 మందికి తగ్గకుండా ఉపాధిహామీ కూలీలతో అభివృద్ధి పనులు చేయించాలని వికారాబాద్ కలెక్టర్ నిఖిల సూచించారు. ఇందుకు సంబంధించిన డబ్బులు ఎప్పటికప్పుడు ఎఫ్టీవోలో అప్లోడ్ చేసి చెల్లించే ఏర్పాట్లు చేయాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని గ్రామకార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లను హెచ్చరించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన నవాబుపేట మండలం మదన్పల్లి గ్రామ కార్యదర్శిని వెంటనే సస్పెండ్ చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారిని ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలు నుంచి ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీఓలు, గ్రామ కార్యదర్శులతో గ్రామంలో చేపట్టిన ప్రభుత్వ అభివృద్ధి పనులపై వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ కార్యదర్శులు స్థానికంగా ఉండాలని, ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి పారిశుధ్యం, పరిశుభ్రత పనులు చేయించాలన్నారు. గ్రామంలో అవెన్యూ ప్లాంటేషన్ పల్లెప్రకృతి వనాలు, డంపింగ్యార్డుల వద్ద పనులు పరిశీలించాలని చెప్పారు. ఉపాధి హామీ కూలీలు చేపట్టిన పనులు పరిశీలించాలన్నారు. కూలీలను ఒకరోజు ముందే సమావేశపరిచి మరుసటి రోజు చేయాల్సిన పనులు గురుంచి తెలియజేయాలని చెప్పారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో కూర్చొని రిజిస్టర్లు పూర్తి చేసి ఉంచాలన్నారు. వచ్చే సంవత్సరం లక్ష్యం మేరకు హరితహారం కోసం అవసరమైన మొక్కలు పెంచాలని కలెక్టర్ ఆదేశించారు. ఒక్క బ్యాగ్ సైతం ఖాళీగా కనిపించరాదని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. నర్సరీలలో మిగిలివున్న మొక్కలు వెంటనే నాటాలన్నారు.
రోడ్లకు ఇరువైపుల మొక్కలు నాటే కార్యక్రమానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. ఉపాధిహామీ కూలీలకు నర్సరీలలో పనిచేసే వాచర్లకు సంబంధించిన చెల్లింపులు ఎప్పటికప్పుడు జరుగాలని పేర్కొన్నారు. పల్లె ప్రకృతి వనాలు, మినీ పల్లె ప్రకృతి వనాల పనుల్లో పురోగతి కన్పించాలని, బోర్డులు, ఫెన్సింగ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో పర్యటించినప్పుడు పనులలో తేడాలు కనిపిస్తే కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు. అన్ని గ్రామ పంచాయతీలలో వైకుంఠధామాల పనులను వేగంగా పూర్తి చేయాలని, ఇప్పటికే పూర్తయిన పనులకు సంబంధించిన చెల్లింపులకు ఎఫ్టీవోలు అప్లోడ్ చేయాలన్నారు.
వారం రోజుల్లో పెండింగ్లో ఉన్న చెల్లింపుల పనులు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వైకుంఠధామాలకు సంబంధించిన సర్పంచ్ల డబ్బులు, ఉపాధిహామీ కూలీలు, నర్సరీలలో పనిచేసే వాచర్ల డబ్బులు వెంటనే చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, డీఆర్డీవో కృష్ణన్, ఎంపీడీవోలు, ఎంపీవోలు, గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు.