వికారాబాద్, డిసెంబర్ 29, (నమస్తే తెలంగాణ): జిల్లాలో గతేడాదితో పోలిస్తే నేరాలు తగ్గినట్లు జిల్లా పోలీసు అధికారి ఎన్.కోటిరెడ్డి వెల్లడించారు. గురువారం ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో వార్షిక క్రైం నివేదికపై ఎస్పీ విలేకరుల సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. జిల్లా ప్రజల సహకారంతో శాంతి భద్రతల సమస్య రాకుండా జిల్లా అంతటా గట్టి నిఘా పెట్టామని, గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 12.71 శాతం మేర నేరాలు తగ్గినట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా అన్ని నేరాలకు సంబంధించి గతేడాది 4306 కేసులు నమోదుకాగా, ఈ ఏడాది 3523 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. ఈ ఏడాది ప్రధానంగా విచారణలో ఉన్న కేసులు, ఎన్ఫోర్స్మెంట్ కేసులు పెంచుట, రోడ్డు ప్రమాదాల కేసులు, ఆత్మహత్యల కేసులు, సీసీ టీవీ కెమెరాలను పెంచడమే లక్ష్యంగా నిర్దేశించుకొని పని చేయడం జరిగిందని, ప్రతినెలా సమీక్షలు నిర్వహించి లక్ష్యాన్ని సాధించామన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల కేసులు గతేడాదితో పోలిస్తే చాలా వరకు తగ్గాయన్నారు. గతేడాది 423 రోడ్డు ప్రమాద కేసులు నమోదుకాగా, ఈ ఏడాది 29.78 శాతం మేర రోడ్డు ప్రమాద కేసులు తగ్గి 297 కేసులు నమోదైనట్లు తెలిపారు.
రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకుగాను ప్రజలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించడంతోపాటు లేజర్ గన్ కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం సేవించిన కేసులు, ఈ-పెట్టి కేసులను నమెదు చేశామన్నారు. జిల్లావ్యాప్తంగా 5204 డ్రంక్ డ్రైవ్ కేసులు నమోదు చేయడంతోపాటు నిర్దేశించిన వేగానికి మించి వెళ్లినందుకుగాను 12,343 వాహనాలకు జరిమానాలను విధించామన్నారు. జిల్లాలో ఆత్మహత్యల కేసులనూ తగ్గించేలా పోలీసు కళాజాత బృందాలతో కార్యక్రమాలను నిర్వహించి, ముఖ్యంగా ఆత్మహత్య కేసులు నమోదయ్యే నవాబుపేట్, మోమిన్పేట్, మర్పల్లి మండలాల్లో ప్రజలకు ప్రత్యేక అవగాహన కల్పించామన్నారు. ఎన్ఫోర్స్మెంట్ కేసులను పెంచి గుట్కా, ఇసుక, కలప, మట్కా, పేకాట, పీడీఎస్ బియ్యం, నకిలీ విత్తనాలు తదితరాలపై ప్రత్యేక దృష్టి పెట్టి నేరాలను తగ్గించేందుకు కృషి చేశామన్నారు. సైబర్ క్రైమ్ నేరాలను తగ్గించేందుకు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని, జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది 28 సైబర్ క్రైమ్ కేసులు నమోదుకాగా, 5 కేసులను ఛేదించామన్నారు. నేరాల తగ్గింపులో ముఖ్యమైన సీసీ కెమెరాలకు సంబంధించి జిల్లావ్యాప్తంగా 2281 ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా గతేడాది 54 నమోదుకాగా, ఈ ఏడాది 34 కేసులు నమోదయ్యాయని ఎస్పీ పేర్కొన్నారు.
కల్తీలపై టాస్క్ఫోర్స్ ఉక్కుపాదం..
జిల్లాలో అక్రమంగా జరుగుతున్న కల్తీలపై ఉక్కుపాదం మోపేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేసి తరుచూ తనిఖీలు నిర్వహిస్తున్నామని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. ఈ ఏడాది జిల్లాలో నకిలీ విత్తనాలు, కల్తీ టీ పౌడర్, పీడీఎస్ బియ్యం, కల్తీ కారం పొడి, కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్లను స్వాధీనం చేసుకొని, జిల్లావ్యాప్తంగా 198 కేసులు నమోదు చేశామన్నారు. ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ కార్యక్రమాల్లో భాగంగా 356 పిల్లలను కాపాడడం జరిగిందన్నారు. జిల్లాలోని మహిళలు, విద్యార్థినుల రక్షణ కోసం షీ టీంలను ఏర్పాటు చేశామని, మహిళలను వేధించిన ఐదుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతోపాటు 20 మందిపై పెట్టీ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. జిల్లాలో జరుగుతున్న రేప్ కేసులు, పొక్సో కేసుల్లో బాధితులకు భరోసా కేంద్రం ద్వారా భరోసా కల్పిస్తున్నామని, భరోసా బాధితులకై రూ.19.95 లక్షలను విడుదల చేశామన్నారు. అసాంఘిక శక్తుల నుంచి జిల్లా ప్రజలను కాపాడేందుకుగాను ప్రతినెలా కార్డన్ సెర్చ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని,
ఈ ఏడాది 13 కార్డెన్ సెర్చ్లు నిర్వహించి సరైన పత్రాలు లేని 452 వాహనాలను సీజ్ చేయడంతోపాటు జిల్లా అంతటా వాహనాల తనిఖీలను చేపట్టి సరైన పత్రాలులేని 399 వాహనాలను స్వాధీనం చేసుకొని 5 కేసులు నమోదు చేశామన్నారు. కేసుల్లో ఎలాంటి జాప్యం జరుగకుండా ఫిర్యాదుదారులకు న్యాయం జరిగేలా వెంటనే ఛార్జ్షీట్లు వేసి విచారణలో ఉన్న కేసులను తగ్గించామన్నారు. మరోవైపు 100 డయల్కు ఫోన్ వచ్చిన 5-10 నిమిషాల్లోనే పోలీసులు స్పాట్కు చేరుకుంటున్నారని, 25,081 100 డయల్ ఫోన్ కాల్స్ వచ్చినట్లు తెలిపారు. శాంతిభద్రతలు తలెత్తిన సమయంలో ఎక్కువ మంది గుమికూడకుండా జిల్లాలో 4 క్విక్ రియాక్షన్ బృందాలను నియమించడం జరిగిందన్నారు. ప్రజలందరి సహకారంతో వచ్చే ఏడాది కూడా నేరాలను తగ్గించేందుకు కృషి చేస్తామని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ ఎంఏ.రషీద్, డీఎస్పీలు కరుణసాగర్, సత్యనారాయణ, శేఖర్ గౌడ్, ఎస్బీ సీఐ నాగేశ్వర్ రావు, సైబర్ క్రైం సీఐ శ్రీనివాస్, మహిళా పీఎస్ సీఐ ప్రమీల తదితరులు పాల్గొన్నారు.
డిసెంబర్ 31న డీజేలకు అనుమతి లేదు…
నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా డిసెంబర్ 31న అసాంఘిక కార్యక్రమాలను నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామని, అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత రోడ్డు మీద తిరిగితే కేసులు నమోదు చేస్తామని ఎస్పీ కోటిరెడ్డి హెచ్చరించారు. జిల్లావ్యాప్తంగా డిసెంబర్ 31న డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించేందుకుగాను ప్రత్యేకంగా 20 బృందాలను నియమించామన్నారు. నూతన సంవత్సర వేడుకల్లో డీజేలకు ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేశారు.