అంటురోగాలపై జాగ్రత్తగా ఉండాలి
పంటలపై రైతులకు అవగాహన పెంచాలి
చేపల పెంపకాన్ని ప్రోత్సహించాలి
విద్యార్థులందరూ ఆన్లైన్ తరగతులకు హాజరయ్యేలా చూడాలి
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి
అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి
దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలందాలి
జడ్పీ స్థాయి సంఘాల సమావేశాల్లో చైర్ పర్సన్ పట్నం సునీతారెడ్డి
వికారాబాద్, జూలై 17, (నమస్తే తెలంగాణ) : భారీ వర్షాలు పడుతున్నందున గ్రామాల్లో పారిశుధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు జడ్పీ చైర్ పర్సన్ పట్నం సునీతారెడ్డి సూచించారు. గ్రామాల్లో మురుగు కాలువలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, గ్రామాల్లో నీటి ట్యాంకులు నెలకు మూడుసార్లు శుభ్రం చేయాలని తెలిపారు. జిల్లా పరిషత్ నుంచి పల్లెల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. జడ్పీ స్థాయి సంఘాల సమావేశాల్లో భాగంగా శనివారం వివిధ శాఖలపై సుదీర్ఘంగా సమీక్ష చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రణాళిక పనులతో పల్లెలు ప్రగతి సాధించాలన్నారు. ప్రతి పంచాయతీలో శ్మశానవాటిక, డంపింగ్ యార్డులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులు, ప్రజాప్రతినిధులను సమన్వయం చేస్తూ సమగ్రాభివృద్ధికి బాధ్యతగా పనిచేయాలని సూచించారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలన్నారు. ఆన్లైన్ తరగతులకు విద్యార్థులందరూ హాజరయ్యేలా చూడాలన్నారు. స్కూళ్లకు ఎన్ని సన్నబియ్యం వస్తున్నాయి, పాఠశాలలకు సంబంధించిన వివరాలు తమకు తెలుపాలని జడ్పీటీసీలు డీఈవోను కోరారు. తాగునీటి కోసం కస్తూర్బాగాంధీ పాఠశాలలకు జడ్పీ నుంచి నిధులు ఇచ్చామని.. ఆ పనులు వెంటనే పూర్తి చేయాలని చైర్ పర్సన్ సూచించారు. జిల్లాలో అక్షర భారతి స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న వయోజన విద్యకు సంస్థ ప్రతినిధులు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయని, వారిపై విచారణ జరపాలని సభ్యులు కోరారు. ఉపాధి చట్టం కింద చేపట్టిన డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు, పాఠశాలల్లో టాయిలెట్స్ నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఎస్సీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా ఇస్తున్న సబ్సిడీ పథకాలు అర్హులైన వారికి చేరేలా ఎంపీడీవోలు చర్యలు తీసుకోవాలన్నారు.
జిల్లా పరిషత్ సాధారణ నిధుల్లో లోటు బడ్జెట్ ఏర్పడిందని సీఈవో జానకీరెడ్డి తెలిపారు. ప్రస్తుతం 35 శాతం గ్రాంటు కింద పనులు మంజూరు చేసుకోవచ్చని జడ్పీ చైర్ పర్సన్ పట్నం సునీతారెడ్డి తెలిపారు. పనులు, పైనాన్స్ కమిటీ సమావేశంలో సాధారణ నిధులు తప్ప మిగతా గ్రాంటుల కింద కొత్త పనులు మంజూరు ఇస్తామని సునీతారెడ్డి అన్నారు. 1766 పనులు మంజూరు కాగా, 1157 పనులు పూర్తయ్యాయని సీఈవో జానకీరెడ్డి సభ్యులకు తెలిపారు. పనులకు సంబంధించి రూ.29 కోట్ల బిల్లులు ఇప్పటికే చెల్లించామని, మిగతా బిల్లులు పెండింగ్లో ఉన్నాయన్నారు.
అంతకుముందు జడ్పీ వైస్ చైర్మన్ బైండ్ల విజయ్ కుమార్ అధ్యక్షతన వ్యవసాయంపై సమీక్ష చేశారు. భూసార పరీక్షలు చేసి రైతులకు పంటల సాగుపై సూచనలు ఇవ్వాలని సూచించారు. డ్రాగన్ ఫ్రూట్ తోటల పెంపకంపై జిల్లాలో రైతులు ఆసక్తి చూపుతున్నారని వారిని ప్రోత్సహించాలని సభ్యులు సూచించారు. అలాగే మహిళా శిశు సంక్షేమం, సాంఘిక సంక్షేమంపై స్థాయి సంఘాల చైర్ పర్సన్ సుజాత, చౌహాన్ అరుణ దేషు అధ్యతన జరిగాయి. కార్యక్రమంలో వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్, జడ్పీటీసీలు సంధ్యారాణి, ధారాసింగ్, సంతోష, మహిపాల్, మధుకర్, శ్రీనివాస్రెడ్డి, రాందాస్నాయక్, హరిప్రియ, మేఘమాల, జయమ్మ, నాగిరెడ్డి, అధికారులున్నారు.