పరిగి : కొవిడ్ వ్యాక్సినేషన్ లక్ష్యం వందశాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నిఖిల ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో వైద్యాధికారులు, తాసిల్దార్తో వ్యాక్సినేషన్పై జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇంటింటి సర్వే నిర్వహించి, వ్యాక్సిన్ వేసుకోని వారిని గుర్తించి ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ చేయాలన్నారు. తాసిల్దార్ల సహకారంతో వైద్యాధికారులు ప్రతిరోజు ఎక్కువ మందికి వ్యాక్సినేషన్ చేసి పని పూర్తి చేయాలన్నారు. ఈ పనిలో మినహాయింపులు ఉండవని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. అంగన్వాడీలు, వీఆర్ఏలు, సూపర్వైజర్లు, బీఎల్వోలు ఒక టీంగా ఏర్పడి ఇంటింటి సర్వే చేయాలన్నారు.
టీం సభ్యులు వాహనాలు సమకూర్చుకుని ప్రతి ఇంటికి వెళ్లి వ్యాక్సినేషన్ చేయించుకోని వారిని గుర్తించి లక్ష్యం పూర్తి చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు మోతిలాల్, చంద్రయ్య, జిల్లా వైద్యాధికారి తుకారాంభట్, వికారాబాద్, తాండూరు ఆర్డీవోలు ఉపేందర్రెడ్డి, అశోక్కుమార్, వైద్యాధికారులు, తాసిల్దార్ పాల్గొన్నారు.