పరిగి : హైదరాబాద్లోని హైటెక్స్లో సోమవారం నిర్వహించే టీఆర్ఎస్ ప్లీనరీకి వికారాబాద్ జిల్లా నుంచి పలువురు టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు హాజరుకానున్నారు. సోమవారం ఉదయం 10గంటల వరకు ఆహ్వానితులందరూ ప్లీనరీ ప్రాంగణానికి చేరుకోవాలని పార్టీ ఆదేశం. ఉదయం 10 నుంచి 10.30 వరకు ప్రతినిధుల పేర్ల నమోదు జరుగుతుంది. ఉదయం 11 గంటలకు పార్టీ ప్లీనరీ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి వికారాబాద్ జిల్లా పరిధిలో గల అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పలువురికీ ఆహ్వానం అందింది.
జిల్లా నుంచి ఎమ్మెల్సీ, జెడ్పీ చైర్పర్సన్, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, మండల రైతుబంధు సమితి అధ్యక్షులకు ప్లీనరీకి ఆహ్వానాలు అందాయి. వారికి ప్రత్యేకంగా పాసులు సైతం జారీ చేయడం జరిగింది. తద్వారా ఆహ్వానం ఉన్నవారు సకాలంలో ప్లీనరీకి హాజరుకావాలని సూచించారు.