వికారాబాద్ : నూతన కలెక్టరేట్ నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధంగా ఉంచాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. మంగళవారం వికారాబాద్ నూతన కలెక్టరేట్ను జిల్లా కలెక్టర్ నిఖిలతో కలిసి పరిశీలించారు. మిగిలి ఉన్న చిన్న చిన్న పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ మిగిలిన పనులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. కార్యాలయ ఆవరణం అంతట పచ్చని వాతావరణం కనిపించేలా అందంగా తీర్చిదిద్దాలని సూచించారు. కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో రానున్నారన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ నిఖీల మాట్లాడుతూ ఏసీలు, లిఫ్ట్లు సక్రమంగా పని చేస్తున్నాయా లేదా అని సరి చూసుకోవాలన్నారు. పనుల్లో జాప్యం జరుగకుండా నాణ్యతతో పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు తెలియజేశారు. అపరిశుభ్రతకు తావులేకుండా చూడాలని వివరించారు. వీరి వెంట ఆర్డీవో ఉపేందర్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.