పరిగి : 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వికారాబాద్లోని ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ జెండా రెపరెపలాడింది. కొవిడ్ నిబంధనలు అనుసరించి ఆయా ప్రభుత్వ కార్యాలయాల వద్ద అధికారులు జాతీయ జెండా ఎగురవేశారు. వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ నిఖిల జాతీయ జెండాను ఎగురవేశారు. అంతకుముందు మహాత్మాగాంధీ, బీఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు కలెక్టర్ నిఖిల పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. వికారాబాద్ క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, పరిగిలోని పల్లవి విద్యాసంస్థల వద్ద ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి, కొడంగల్లోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి, జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ కోటిరెడ్డి, జిల్లా పరిషత్ కార్యాలయంలో జెడ్పీ సీఈవో జానకిరెడ్డి, ఆయా శాఖల కార్యాలయాల వద్ద జిల్లా అధికారులు జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమాల్లో జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ విజయ్కుమార్, జిల్లా అదనపు ఎస్పీ రషీద్, వికారాబాద్ ఆర్డీవో విజయకుమారి తదితరులు పాల్గొన్నారు.
త్యాగధనులను స్మరిస్తుండాలి.. ఎస్పీ కోటిరెడ్డి
ఎందరో త్యాగధనుల పోరాట ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని, వారిని స్మరిస్తుండాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి పేర్కొన్నారు. 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా బుధవారం వికారాబాద్ జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కోటిరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ తెలంగాణ పోలీసులు దేశంలోనే అత్యున్నత ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్న పోలీసు వ్యవస్థగా పేరు పొందిందన్నారు. మహనీయుల త్యాగఫలం ద్వారా మనం ఈరోజు స్వేచ్ఛగా, స్వతంత్రంగా జీవిస్తున్నామని తెలిపారు. పోలీసు ఉద్యోగం రావడం అదృష్టంగా భావించి సక్రమంగా విధులు నిర్వహించి, ప్రజల ఆదరాభిమానాలు పొందాలన్నారు.
పోలీసులు నిరంతరం శాంతిభద్రతలు కాపాడడంలో ఎంతో శ్రమించి తమ ప్రాణాలు ఫణంగా పెట్టిన వారు ఉన్నారని చెప్పారు. అందరు కలిసికట్టుగా పనిచేసి జిల్లాకు మంచి పేరు తీసుకువచ్చే విధంగా పనిచేయాలని ఎస్పీ సూచించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ ఎం.ఎ.రషీద్, వికారాబాద్ డీఎస్పీ సత్యనారాయణ, ఏఆర్ డీఎస్పీ సత్యనారాయణ, పోలీసు అధికారులు పాల్గొన్నారు.