వికారాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం నవ సమాజ నిర్మాణానికి పునాదులు వేసిందని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రభుత్వం అన్ని కులాలు, మతాలకు ప్రాముఖ్యతను ఇస్తుందని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. సోమవారం వికారాబాద్ పట్టణంలోని అంబేద్కర్ భవన్లో క్రైస్తవులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న క్రిస్మస్ బహుమతులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం క్రైస్తవులకు కానుకగా దుస్తువుల పంపిణీ చేస్తుందన్నారు. మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్లు కన్న కలలను ముఖ్యమంత్రి కేసీఆర్ నిజం చేస్తున్నారని తెలిపారు.
క్రిస్మస్, రంజాన్, బతుకమ్మ పండుగలకు ప్రభుత్వ పరంగా నిర్వహించి ప్రజామెప్పు పొందారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్, మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, ఎంపీపీ చంద్రకళ, మండలాధ్యక్షుడు కమాల్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేశ్కుమార్, నాయకులు పాల్గొన్నారు.