కులకచర్ల : దేవాలయాల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. శనివారం కులకచర్ల మండల పరిధిలోని బండవెల్కిచర్ల పాంబండ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో దేవాలయ సమీపంలో దేవాదాయ శాఖ ద్వారా రూ. 50లక్షలు కల్యాణ మండప నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయించిన ప్రోసిడింగ్ పత్రాన్ని దేవాలయ కమిటీ చైర్మన్ ఘనాపురం రాములుకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. రాష్ట్రంలోని దేవాలయాలకు ప్రత్యేక నిధులను దేవాదాయ శాఖ ద్వారా మంజూరు చేయడంతో పాటు దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు.
పాంబండ రామలింగేశ్వరస్వామి దేవాలయం అతి ప్రాచీన పుణ్యక్షేత్రమని, పాంబండ పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. దేవాలయంలో వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని, దేవాలయం సమీపంలో కల్యాణ మండపం నిర్మించడం ద్వారా పెళ్లిళ్లు, వివిధ శుభకార్యాలు చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. త్వరితగతిన కల్యాణ మండపం నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నారు. దేవాలయంలో కల్యాణ మండపం నిర్మించేందుకు రూ. 50లక్షలు మంజూరు చేయించిన పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డికి దేవాలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, పూజారులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ సత్యహరిశ్చంద్ర, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శేరి రాంరెడ్డి, మండల రైతుబంధు సమితి అధక్షుడు పీరంపల్లి రాజు, టీఆర్ఎస్ నాయకులు కంగారి ఆంజనేయులు, మాలె కృష్ణయ్యగౌడ్, రాములు నాయక్, బచ్చిరెడ్డి, శ్రీనివాస్, కొండయ్య, పూజారులు, దేవాలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.