వికారాబాద్, మే 26 : నకిలీ విత్తనాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలని వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. శుక్రవారం పట్టుబడిన నకిలీ పత్తి విత్తనాలపై వికారాబాద్ టౌన్ పోలీస్స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ వికారాబాద్ పట్టణంలో నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్నట్లు టాస్క్ఫోర్స్ సీఐ వెంకటేశంకు నమ్మదగిన సమాచారం వచ్చిందన్నారు. శుక్రవారం ఉదయం 5 గంటలకు పట్టణ సీఐ శ్రీను పోలీస్ సిబ్బంది, టాస్క్ ఫోర్స్ సిబ్బందితో పట్టణంలోని ఎన్నెపల్లి చౌరస్తాలో తనిఖీలు చేశారు.
ఒక వ్యక్తి రెండు బ్యాగులతో అనుమానాస్పదంగా సంచరిస్తుండగా ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించారన్నారు. అతడి వద్ద 25కిలోల నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లు లభించాయి. అతను ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి చెందిన జాగర్లమూడి శ్రీనివాస్రావుగా గుర్తించారన్నారు. గత సంవత్సరం పెద్ద ఎత్తున సదానంద్ బ్రాండ్కు చెందిన హెచ్టీ కాటన్ విత్తనాలను పండించానని, ప్రస్తుతం తెలంగాణ ప్రాంతంలో ఈ విత్తనాలకు మంచి డిమాండ్ ఉందని తెలిపారన్నారు. కర్నూల్ జిల్లాలో జిన్నింగ్ చేసి 10నుంచి 12 క్వింటాళ్ల వరకు విత్తనాన్ని రెడీ చేసుకొని దానికి గులాబీ రంగు కెమికల్ వేసి నకిలీ విత్తనాలు తయారు చేయడం జరిగిందన్నారు. వీటిని కర్ణాటక రాష్ట్రంలో ముదెల్లి మండలంలోని వీర్లపల్లి గ్రామంలో రెండు నెలల క్రితం అద్దెకు తీసుకొని భద్రపర్చడం జరిగిందన్నారు.
శాంపిల్స్ తీసుకొని రైతులను కలిసే ఉద్దేశంతో వెళ్తుండగా మార్గ మధ్యంలో పట్టుకున్నట్లు తెలిపారు. వికారాబాద్ వ్యవసాయ అధికారులతో తనిఖీలు చేయించగా అవన్నీ నకిలీ విత్తనాలుగా నిర్ధారించడం జరిగిందన్నారు. వికారాబాద్ సీఐ శ్రీను కర్ణాటక రాష్ట్రంలోని ముధెల్లి మండలంలో ఈర్లపల్లి గ్రామానికి వెళ్లి అక్కడ నిందితుడు దాచి పెట్టిన సుమారు రూ.9.75క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. గత రెండు రోజుల క్రితం మోమిన్పేట మండలంలో ఇదే విధంగా నకిలీ పత్తి విత్తనాలను అమ్ముతూ వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. అతడి వద్ద క్వింటాల్ నకిలీ విత్తనాలు లభించాయని తెలిపారు. వీరిద్దరిపై కేసులు నమోదు చేశామన్నారు.
10 క్వింటాళ్ల వరకు నకిలీ పత్తి విత్తనాలు సీజ్ చేసినట్లు తెలిపారు. వీరిద్దరూ ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి చెందిన వారుగా పేర్కొన్నారు. రైతులు విడిగా ఉండే పత్తి విత్తనాలను, అనుమతులు లేని షాపుల్లో విత్తనాలు కొనుగోలు చేయకూడదన్నారు. విత్తనాలు కొనుగోలు చేసిన దుకాణాల నుంచి తప్పనిసరిగా రసీదులు పొందాలన్నారు. నకిలీ విత్తనాలపై వ్యవసాయాధికారులతో రైతులకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. నకిలీ విత్తనాలు పట్టుకున్న వికారాబాద్ సీఐ శ్రీను బృందం, మోమిన్పేట సీఐ వెంకటేశం బృందానికి ఎస్పీ అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ సత్యనారాయణ, ఏడీఏ వినోద్కుమార్, ఏవో జ్యోతి, సీఐలు శ్రీను, వెంకటేశంలు పాల్గొన్నారు.