వికారాబాద్ : సీజనల్ వ్యాధులతో పాటు పలు రకాల వ్యాధులకు ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులు సొంత వైద్యం చేయకూడదని వికారాబాద్ జిల్లా వైద్యాధికారి తుకారం తెలిపారు. మంగళవారం వికారాబాద్ అనంతగిరి డీఎంహెచ్వో కార్యాలయంలో రైఫ్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో జిల్లాలోని ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి తుకారం మాట్లాడుతూ ప్రస్తుతం ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడి ఆసుపత్రులకు వస్తున్నారని, ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులు తెలిసి తెలియని వైద్యం చేసి ఇబ్బందులకు గురి చేయకూడదన్నారు.
వ్యాధి తీవ్రతను గుర్తించి తమదృష్టికి తీసుకొస్తే పరీక్షలు జరిపి చికిత్సలు చేయడం జరుగుతుందన్నారు. డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులకు సరైన చికిత్సలు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆర్టీపీసీఆర్ వంటి కరోనా పరీక్షలను అందుబాటులోకి తీసుకోచ్చమన్నారు. ఈ సందర్భంగా టీబీ ఆసుపత్రి వైద్యుడు రవీంద్రయాదవ్ మాట్లాడుతూ టీబీ వ్యాధిని గుర్తించి వైద్య పరీక్షలు చేస్తున్నమని తెలిపారు. అనంతరం డీఎంహెచ్వోకు సన్మానం చేశారు. కార్యక్రమంలో వైద్యులు సాయిబాబా, శాంతప్ప, వినోద్రెడ్డి, అరవింద్ పాల్గొన్నారు.