పరిగి : జిల్లా పరిధిలో బృహత్ పల్లెప్రకృతి వనాలలో మొక్కలు నాటే పనులు త్వరగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ నిఖిల సూచించారు. ప్రతి మండలానికి నాలుగు చొప్పున మినీ బృహత్ పల్లె ప్రకృతి వనాల కోసం స్థలాల సేకరణ చేపట్టాలన్నారు. శుక్రవారం డీఆర్సీ భవనంలో ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలు, పనుల పురోగతిపై కలెక్టర్ నిఖిల మండలాల వారీగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని మండలాల్లోని బృహత్ పల్లె ప్రకృతి వనాలలో గుంతలు తీయడం, మొక్కలు నాటే పనులు వేగంగా నిర్వహించాల్సిందిగా ఆదేశించారు.
ప్రతి మండలానికి నాలుగు చొప్పున మినీ బృహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు స్థలాలు సేకరించాలని, ఇందుకోసం తాసిల్దార్ల సహకారంతో పనులను వెంటనే పూర్తి చేయలన్నారు. యాప్ ద్వారా రోజు వారిగా పనుల పురోగతిని పరిశీలిస్తానని కలెక్టర్ తెలిపారు. గ్రామ పంచాయతీల్లో చేపట్టిన పనులు, చెల్లింపుల వివరాల నివేదికను అందజేయాలని డీఆర్డీవోను కలెక్టర్ ఆదేశించారు. వైకుంఠధామాలకు సంబంధించిన చెల్లింపుల పనులు వెంటనే చేపట్టాలన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా అన్ని మండలాల్లోనూ లక్ష్యం మేరకు మొక్కలు నాటే కార్యక్రమం పూర్తి చేయాలన్నారు. మొక్కలు నాటిన వివరాలను ప్రభుత్వ వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సిందిగా కలెక్టర్ సూచించారు.
హరితహారం నర్సరీలలో పనిచేసే వన సేవకుల వేతనాల చెల్లింపులో నిర్లక్ష్యం వహించకుండా వెంటనే చెల్లించాలన్నారు. గ్రామాల్లో ఇంకుడుగుంతల పనులను వేగవంతం చేయాలని, ఉపాధిహామీ కూలీలు అధిక సంఖ్యలో పనుల్లో పాల్గొనేలా చూడాలన్నారు. ప్రతి గ్రామ నర్సరీలలో ఇకనుంచి 15వేల మొక్కలు పెంచాలని కలెక్టర్ పేర్కొన్నారు. అసంపూర్తి పనులు, చెల్లింపుల పనులు వారం రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పనులలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, జడ్పీ సీఈవో జానకిరెడ్డి, డీఆర్డీవో కృష్ణన్, డీపీవో మల్లారెడ్డి, ఇన్చార్జి పంచాయతీరాజ్ ఈఈ ఉమేశ్, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఈసీలు, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.