పరిగి : సీఎం కేసీఆర్ నేతృత్వంలో హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద చేపట్టిన మహాధర్నాకు గురువారం వికారాబాద్ జిల్లా నుంచి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తరలివెళ్లారు. వికారాబాద్ జిల్లా తరపున జిల్లా పరిషత్ చైర్పర్సన్ పి. సునీతారెడ్డి, ఎమ్మెల్సీ పి.మహేందర్రెడ్డి, వికారాబాద్, పరిగి, తాండూరు, కొడంగల్ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కొప్పుల మహేశ్రెడ్డి, ఫైలెట్ రోహిత్రెడ్డి, నరేందర్రెడ్డి, టీఎస్ఈడబ్ల్యుఐడీసీ చైర్మన్ నాగేందర్గౌడ్, డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్రెడ్డిలు మహాధర్నాలో పాల్గొన్నారు. రైతుల పక్షాన ఏకంగా రాష్ట్ర ప్రభుత్వమే ఈ మహాధర్నా నిర్వహించడం చరిత్రలో నిలిచిపోతుందన్నారు.
మహాధర్నాకు జిల్లా పరిషత్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీబీ చైర్మన్లు, రైతుబంధు సమితి అధ్యక్షుడు పాల్గొనాలని అధిష్టానం సూచించింది. ఇదిలావుండగా వికారాబాద్ జిల్లా నుంచి పలువురు ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఇతర ప్రజా ప్రతినిధులతో పాటు రైతులు సైతం మహాధర్నాకు స్వచ్ఛందంగా తరలివెళ్లారు. తాము సైతం సీఎం కేసీఆర్ బాటలో నడుస్తూ రైతులకు అండగా నిలుస్తామని వారు స్పష్టం చేశారు.