కొడంగల్ : మున్సిపల్ పరిధిలో రూ. 15కోట్ల నిధులతో కొనసాగుతున్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయించాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి సంబంధిత అధికారులకు ఆదేశించారు. బుధవారం మున్సిపల్ పరిధిలోని 2వ వార్డులో ఎమ్మెల్యే పర్యటించి అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మున్సిపల్ అభివృద్ధిలో భాగంగా రూ. 15 కోట్లకు సంబంధించి మంజూరు కాబడ్డ మురుగుకాలువ, సీసీ రోడ్డు నిర్మాణం పనులు వెంటనే పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పనులు నత్తనడకన కొనసాగుతున్నాయన్నారు.
ఇదివరకే పనులు పూర్తి కావాల్సి ఉండగా అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోకపోవడంతోనే పనులు సరిగ్గా కొనసాగుతలేవని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా వార్డు వాసులతో నేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఇబ్బందుల ఏర్పడకుండా పనులు త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకొంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్, కౌన్సిలర్లు మధుసూదన్యాదవ్, వెంకట్రెడ్డి, మాజీ సర్పంచ్ రమేశ్బాబు, మాజీ జడ్పీటీసీ ఏన్గుల భాస్కర్, మున్సిపల్ కమిషనర్ నాగరాజు పాల్గొన్నారు.