పరిగి : రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు అండగా నిలుస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. దివ్యాంగులమనే భావన ఎప్పుడు రాకూడదని, తామంతా మీ వెంటే ఉన్నామని ఆమె భరోసా కల్పించారు. శుక్రవారం వికారాబాద్ డీపీఆర్సీలో జరిగిన ప్రపంచ దివ్యాంగుల దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ సంక్షేమ పథకాలలో దివ్యాంగులకు 5 శాతం అందేలా సర్కారు కృషి చేస్తుందన్నారు. ఎమ్మెల్యేల సహకారంతో డబుల్బెడ్రూమ్ ఇళ్లలోను దివ్యాంగులకు కేటాయింపు జరిగేలా చూస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 500 భవిత సెంటర్లలో 50వేల మంది వికలాంగులకు ఫిజియోథెరపి చేయించడం జరుగుతుందని తెలిపారు.
జిల్లాలో 833మంది వికలాంగులకు ఫిజియోథెరపి చేయించగా 23మంది సాధారణంగా మారారని, ఇది సంతోషించదగ్గ విషయమన్నారు. మారుతున్న సమాజానికి అనుగుణంగా దివ్యాంగులకు అందజేసే పరికరాలను సైతం అత్యాధునికమైనవి అందజేస్తున్నట్లు చెప్పారు. దేశంలోని ఇతర రాష్ట్రాలలో 70శాతం అంగవైకల్యం ఉంటేనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, తెలంగాణలో 45శాతం వైకల్యం ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉద్యోగాలలో 3నుంచి 4శాతానికి రిజర్వేషన్ పెంచడం జరిగిందని మంత్రి చెప్పారు. దివ్యాంగులను ఎవరు చిన్నచూపు చూడరాదని, అందరితో పాటు వీరి అభివృద్ధిని కాంక్షించాలన్నారు. ఆ దిశగా సీఎం కేసీఆర్ దివ్యాంగుల గౌరవాన్ని పెంచేలా పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. సామాజిక సమైక్యతలో భాగంగా వికలాంగులు, సాధారణ వ్యక్తుల మధ్య వివాహాలను ప్రోత్సహించడానికి రూ. 50వేలు నగదు ప్రోత్సాహం అందిస్తుండగా దీన్ని లక్ష రూపాయలకు పెంచడం జరిగిందని తెలిపారు. వికారాబాద్ జిల్లాలో ఈ సంవత్సరం 20 మందికి ఈ ప్రోత్సాహం అందించినట్లు మంత్రి పేర్కొన్నారు.
వికలాంగుల సహకార సంస్థ ద్వారా బ్రెయిలీ పలకలు, లాప్టాప్లు, మోటరు యంత్రాలు, ఎంపీ3 ప్లేయర్లు, డిగ్రీ, పీజీ చదువుకుంటున్న వికలాంగులకు వాహనాలు అందిస్తున్నట్లు మంత్రి వివరించారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతారెడ్డి మాట్లాడుతూ దివ్యాంగులు ఎవరు బాధపడరాదని, వికలత్వం శరీరానికేనని, ఆత్మస్థెర్యంతో ముందుకు సాగి సమాజంలో అందరి కంటే అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. సామాన్యుల కంటే వికలత్వం గల అనేక మంది వివిధ రంగాలలో రాణిస్తున్నారని, వారిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ దివ్యాంగులు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన పెంపొందించుకోవాలని చెప్పారు. ఎన్నికల సమయంలో వికలాంగులు నేరుగా పోలింగ్బూత్కు వచ్చి ఓటు వేసేందుకు ర్యాంపులు సైతం ఏర్పాటు చేస్తున్నామని గుర్తు చేశారు.
ఈ సందర్భంగా ఉపాధిహామీ కింద బాగా పని చేసిన వికలాంగులను మంత్రి సబితారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డిలు సన్మానించారు. అంగ వైకల్యం గల 8మందికి సబ్సిడీ రుణాలు రూ. 16లక్షలకు సంబంధించిన చెక్కులను అందజేశారు. అంగన్వాడీ వర్కర్లకు స్మార్ట్ఫోన్లను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి బాలరక్షక్ వాహనాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మనోహర్రెడ్డి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ విజయ్కుమార్, డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్లు మోతిలాల్, చంద్రయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణ, వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, జిల్లా మహిళా, శిశు సంక్షేమాధికారి లలితకుమారి, జిల్లా విద్యాశాఖాధికారి రేణుకాదేవి, ఐసీడీఎస్ అధికారులు, అంగన్వాడీ కార్యకర్తలు, దివ్యాంగులు పాల్గొన్నారు.