పరిగి : మత్స్యకారులకు సర్కారు తోడ్పాటు అందిస్తుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పరిగి మండలం లఖ్నాపూర్ ప్రాజెక్టులో ఎమ్మెల్యే మహేశ్రెడ్డి 1,33,500 రొయ్యపిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో రొయ్యల పెంపకం ఆంధ్రా ప్రాంతంలోనే జరిగేదని, సర్కారు తోడ్పాటుతో తెలంగాణలో కూడా స్థానిక చెరువులలో రొయ్యల పెంపకం చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రభుత్వమే చేప పిల్లలు, రొయ్య పిల్లలు ఉచితంగా అందజేస్తుండటం ద్వారా మత్స్యకారుల కుటుంబాలపై ఎలాంటి భారం లేకుండా వాటి పెంపకానికి సర్కారు తోడ్పాటు అందిస్తుందన్నారు.
మత్స్యకారులకు ఉచితంగా వివిధ రకాల వాహనాలు, ఇతర పరికరాలు అందజేసిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నీలి విప్లవం తీసుకురావడానికి సర్కారు అమలు చేస్తున్న కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని తెలిపారు. ప్రాజెక్టుల నిర్మాణంతో రాష్ట్రంలోనే పెద్ద ఎత్తున చేపల పెంపకానికి అవకాశం ఏర్పడిందన్నారు. లఖ్నాపూర్ ప్రాజెక్టును మినీ ట్యాంక్బండ్గా నిర్మాణం చేస్తుండటంతో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే తెలిపారు.
కార్యక్రమంలో ఎంపీపీ అరవిందరావు, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు ఆంజనేయులు, సీనియర్ నాయకులు ప్రవీణ్కుమార్రెడ్డి, జిల్లా మత్స్యశాఖ అధికారి దుర్గాప్రసాద్, కౌన్సిలర్ వెంకటేష్ పాల్గొన్నారు.