కొడంగల్ : అత్యవసర పరిస్థితుల్లో దూర ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆసుపత్రులకు తక్కువ సమయంలో మెడిసిన్ అందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేసి డ్రోన్ సహాయంతో ఆకాశ మార్గాన మందులు చేరవేసే ప్రక్రియ చేపట్టింది. ఇందులో భాగంగా శనివారం జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రి నుంచి కొడంగల్ పీహెచ్సీకి డ్రోన్ ద్వారా మందులు అందించే ట్రాయల్ రన్ స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా మారుత్ డ్రోన్ కంపెనీ ప్రతినిధి ప్రేమ్కుమార్ మాట్లాడుతూ ఇప్పటి వరకు డ్రోన్ ఆకాశ మార్గాన 15 నుంచి 20 కిలోమీటర్ల దూరం ప్రయాణించడం జరిగిందని, వికారాబాద్ నుంచి కొడంగల్కు ఆకాశ మార్గం 42 కి.మీ దూరం డ్రోన్ ప్రయాణించడం ఇండియాలోనే మొదటి సారని పేర్కొన్నారు.
గతంలో జిల్లా కేంద్రం నుంచి బొంరాస్పేట మండలానికి డ్రోన్ ద్వారా మందులు చేసి సక్సెస్ సాధించినట్లు తెలిపారు. అదే విధగా కొడంగల్ వరకు డ్రోన్ ద్వారా మందులు సరఫరా చేయడం చరిత్రలోనే ప్రప్రథమంగా విజయం సాధించినట్లు తెలిపారు. ఇంత దూరం ప్రయాణించిన తరువాత చేరవేసిన మందులు టెంపరేచర్ వంటి వాటిని పరిశీలించారు. పూర్తి భద్రత ప్రమాణాలతో మందులు చేరుతుందనే నిర్ధారణ అయిందన్నారు. ప్రస్తుతం 5కేజీల బరువుతో డ్రోన్ ప్రమాణం సాగించిందని, రానున్న రోజుల్లో ట్రాయల్ రన్ పూర్తి సక్సెస్ తరువాత అవసరాన్ని బట్టి 16 కేజీల బరువుతో డ్రోన్ ప్రయాణం కొనసాగుతుందన్నారు.
డ్రోన్ ద్వారా వ్యాక్సిన్, మెడిసిన్ బ్లెడ్ స్యాంపుల్స్ వంటి 4 రకాలుగా ఉపయోగం ఉన్నట్లు తెలిపారు. ప్రతి రోజు వినియోగించే దిశగా ప్రభుత్వం ప్రణాళికలు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మారుత్ డ్రోన్ కంపనీ సిబ్బంది సురజ్పెద్ది, రాములతో పాటు కొడంగల్ పీహెచ్సీ వైద్యులు డా. వీణ, డా. శ్రావణి, మున్సిపల్ కమిషనర్ నాగరాజు పాల్గొన్నారు.