వికారాబాద్ : వికారాబాద్ మండల పరిధిలోని గొట్టిముక్కల గ్రామంలో మూడు రోజుల నుంచి గ్రామ దేవతల ఉత్సవాలు జరిగాయి. ఆదివారం ఎంపీటీసీ గోపాల్, సర్పంచ్ వెంటేశం ఆధ్వర్యంలో ఈదమ్మ, పోచమ్మ, మైసమ్మ పండుగలను ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో అమ్మవార్లను పూజించి మొక్కులు మొక్కుకున్నారు. ఇందులో భాగంగా ఎంపీటీసీ గోపాల్ ఇంటి నుంచి జోగిని బోనాన్ని ఎత్తుకొని నృత్యం చేస్తూ అమ్మవారి ఆలయం వరకు ర్యాలీగా వెళ్లారు. విష రోగాలు పోయి, సిరి పంటలు బాగా పండి రైతులు సుఖ సంతోషాలతో ఉంటారని ఏర్పుల అమ్మవారు భవిష్యవాణి తెలిపారు.
అమ్మవారి ఆలయం ముందు నైవేద్యం పెట్టి ప్రత్యేక పూజలు చేశారు. డప్పు చప్పుళ్లకు శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు జరుగడంతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. కార్యక్రమంలో ఉప సర్పంచ్ చాకలి మల్లేశం, గ్రామ పెద్దలు సుద్దగళ్ల సాయన్న, మ్యాకం రాములు, మోత్కూరి బాల్రాజ్, అనంతయ్య, గోపాల్, శ్రీనివాస్రెడ్డి, గ్రామస్తులు ఉన్నారు.