కులకచర్ల : ఉజ్వల పథకం ద్వారా అందించే ఉచిత గ్యాస్ సిలిండర్లను సద్వినియోగం చేసుకోవాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. కులకచర్ల మండల కేంద్రంలో శ్రీగురుదత్త భారత్ గ్యాస్ ఏజెన్సీ ఆధ్వర్యంలో ఉజ్వల యోజన పథకం ద్వారా పేదలకు ఉచితంగా అందిస్తున్న గ్యాస్ సిలీండర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచిత గ్యాస్ కనెక్షన్లను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరుపేదలను అందించే ఈ పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరికి అందించాలని ఏజెన్సీ నిర్వాహకులకు సూచించారు.
ఈ సందర్భంగా ఉచిత గ్యాస్ కనెక్షన్లను తీసుకున్న లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్లను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ సత్యమ్మ, జడ్పీటీసీ రాందాస్ నాయక్, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు శేరి రాంరెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు పీరంపల్లి రాజు, భారత్గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు లక్ష్మి, ఆంజనేయులు, డాపూర్ ఎంపీటీసీ శంకర్, లబ్ధిదారులు పాల్గొన్నారు.