తాండూరు : రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్గుప్తా అన్నారు. ఆదివారం తాండూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలో పర్యాటక రంగం ప్రగతి సాధిస్తుందన్నారు. తెలంగాణ ప్రాంతంలోని చారిత్రక కట్టడాలు, దేవాలయాలు దర్శనీయ ప్రదేశాలు, ఆహ్లాదం పంచే జలపాతాలు, అటవీ కేంద్రాలు పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
అందులో భాగంగా రూ.200 నుంచి 300 కోట్లతో టూరిజం హబ్గా అనంతగిరిని చేస్తున్నట్లు తెలిపారు. తాండూరు నియోజకవర్గంలోని జుంటుపల్లి ప్రాజెక్టు, అంతారం సమీపంలోని అర్బన్ పార్కులతో పాటు పర్యాటక ప్రాంతాల పురోగతిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే రోహిత్రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్రెడ్డితో కలిసి తాండూరు ప్రాంతం గురించి చర్చించి అవసరమైన నిధులు కేటాయిస్తామన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతో దేశంలో తెలంగాణ నెంబర్-1 రాష్ట్రంగా రూపుదిద్దుకుంటుందని అన్నారు.
విజయానికి ప్రతీక జమ్మి చెట్టు
వికారాబాద్, అక్టోబర్ 10 : విజయానికి ప్రతీక జమ్మి చెట్టు అని తెలంగాణ రాష్ట్ర టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస్గుప్తా అన్నారు. వికారాబాద్ పట్టణం శివరాంనగర్ కాలనీలోని దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాతకు ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్పటేల్తో కలిసి పూజలు చేశారు. అనంతరం ఊరికో జమ్మి చెట్టు, గుడికో జమ్మిచెట్లు కార్యక్రమంలో భాగంగా జమ్మిమొక్కను నాటి పూజలు చేశారు. కార్యక్రమంలో వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేశ్కుమార్, కౌన్సిలర్ గాయత్రీలక్ష్మణ్, కౌన్సిలర్లు మోముళ్ల స్వాతి, నవీన్కుమార్, నాయకులు లక్ష్మణ్, రాజ్కుమార్ పాల్గొన్నారు.