వికారాబాద్ : గ్రామాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రకాల పథకాలతో అభివృద్ధి పరుస్తుంది. ఇందులో భాగంగా ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించే విధంగా తెలంగాణ రాష్ట్రం అన్ని జిల్లాలో ఒక్కొ గ్రామంలో 6 రకాల అవగాహన కల్పించే పెయింటింగ్స్ వేయాలని అక్టోబర్ మాసంలో సూచించింది. వికారాబాద్ జిల్లా పంచాయతీ అధికారులు వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టి నవంబర్ మాసంలో పెయింటింగ్ వేయడం పూర్తి చేశారు. జిల్లాలోని 566 గ్రామాల్లో 6రకాల పెయింటింగ్ పూర్తి చేసి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది.
ఆరు రకాల పెయింటింగ్స్…
చెత్తను డంపింగ్ యార్డులో వేయాలి, పరిసకాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి, మరుగుదొడ్లు సద్వినియోగం చేసుకోవాలి, ఇంకుడు గుంతలు, సోక్ఫిట్ నిర్మాణాలు, తడి పొడి చెత్త వేరు చేసే విధానాల, పచ్చదనంపై పెయింట్ వేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
ఎక్కడెక్కడ పెయింటింగ్స్…
గ్రామంలోని ప్రధాన కూడళ్ల వద్ద, రహదారలు పక్కల, జన సంచారం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో, ప్రభుత్వ, ప్రైవేటు భవనాలు, పాఠశాలల గోడలపై రంగురంగులతో 6 రకాల పెయింటింగ్స్ వేశారు. చదువురాని వారికి కూడా గోడలపై వేసిన పెయింటింగ్ బొమ్మలను చేస్తే ఇట్టే అర్థమయ్యే విధంగా చూడ చక్కగా వేశారు. ఈ పెయింటింగ్స్ ప్రతి రోజు గ్రామాల ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తూనే ఉంటున్నాయి. వీటిని ప్రతి ఒక్కరూ పాటించే విధంగా మార్పు వస్తే గ్రామాలు పరిశుభ్రంగా మారుతాయని అధికారులు, ప్రజాప్రతినిధులు చెబుతున్నారు.
రాష్ట్రంలో మొదటి స్థానంగా నిలిచిన వికారాబాద్
మల్లారెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి, వికారాబాద్
ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించే విధంగా సరికొత్త ఆలోచనతో ప్రభుత్వం ముందుకు పోతుంది. ఇందులో భాగంగా జిల్లాలోని 566 గ్రామాల్లో పూర్తిస్థాయిలో పెయింటింగ్ వేయడం జరిగింది. ఒక్కో గ్రామంలో 6రకాలుగా అవగాహన కల్పించే విధంగా రంగు రంగులతో ఆకర్శనీయంగా వేశాం. ఒక గ్రామంలో ప్రజలు పాటించాల్సిన పనులు, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించే విధంగా ఈ పెయింటింగ్ కనిపిస్తున్నాయి. చదువుకున్న వారికి, చదువుకోని వారికి ఈ పెయింటింగ్లను గ్రామంలో ప్రజలు తిరిగే ప్రదేశాల్లో వేయడం జరిగింది. సంబంధిత అధికారులు సహాకారంతో పనులు త్వరగా పూర్తి చేసి, రాష్ట్రంలోనే మొదటగా పెయింటింగ్ పూర్తి చేసిన జిల్లాగా నిలిచింది.