వేసవిలో అటవీ జంతువుల దాహార్తిని తీర్చేందుకు వికారాబాద్ జిల్లా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వన్యప్రాణులు నీరు తాగేందుకు అనుకూలంగా ఉన్న అడవిలోని పలు ప్రాంతాల్లో 120 సాసర్పిట్లు, పెర్కోలేషన్ ట్యాంకులను ఏర్పాటు చేశారు. వీటిలో 10 నుంచి 15 రోజులకొకసారి సోలార్ బోర్వెల్స్ నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకొచ్చి నింపుతున్నారు. ఎండలు ఎక్కువగా ఉన్న సమయంలో, నీటి వినియోగం అధికంగా ఉండే ప్రాంతాల్లో నీటిని తరచుగా నింపుతు న్నారు. కాగా జిల్లాలో 1,08,000 ఎకరాల్లో అటవీ ప్రాంతం విస్తరించి ఉండగా.. అందులో పలు రకాల అడవి జంతువులు సంచరిస్తున్నాయి. జంతువుల కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా 25 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు.
పరిగి, మే 21 : వేసవికాలం వచ్చిందంటే చాలు ఎండల వేడిమికి మరింత దాహం వేస్తుంది. ప్రజల కోసం మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ శుద్ధి చేయబడిన తాగునీరు సరఫరా చేస్తున్న ప్రభుత్వం అడవిలో మూగజీవాలకు కూడా నీటి కష్టాలు లేకుండా చేస్తున్నది. అడవి విస్తీర్ణం పెంచేందుకు నాటిన మొక్కలు ఎండిపోకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. వికారాబాద్ జిల్లావ్యాప్తంగా 1,08,000 ఎకరాల్లో అటవీ విస్తీర్ణం ఉంది. వేసవిలో అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదాలు సంభవిస్తే కలిగే నష్టాన్ని నివారించేందుకు అడవుల రక్షణకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకున్నది. వర్షాకాలం, చలికాలంలో వన్య ప్రాణుల తాగునీటి ఇబ్బందులు ఉండవు. వేసవిలో వాటి దాహార్తి తీర్చేందుకు దట్టమైన అటవీ ప్రాంతంలో ప్రత్యేకంగా సాసర్పిట్లు ఏర్పాటు చేయడం, సోలార్ బోర్వెల్స్తో నీటిని పెర్కోలేషన్ ట్యాంకులలో నింపడం వల్ల నీటి ఇబ్బందులు తీర్చడం జరుగుతున్నది. అలాగే వేసవిలో ఏ జంతువులు నీరు తాగేందుకు వస్తున్నాయో గుర్తించేందుకు జిల్లాలోని పలు చోట్ల ట్రాప్ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు.
వేసవికాలంలో వన్యప్రాణుల కోసం దాహార్తిని తీర్చేందుకు జిల్లావ్యాప్తంగా నీటికి ఇబ్బంది ఉన్న ప్రాంతాలను ఎంపిక చేసి సాసర్పిట్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సాసర్పిట్లలో ప్రతి 10, 15 రోజులకు ఒకసారి చొప్పున నీటిని నింపుతారు. ఎండలు ఎక్కువగా ఉన్న సమయంలో, నీటి వినియోగం అధికంగా ఉండే ప్రాంతాల్లో తరచుగా వాటిలో ట్యాంకర్తో నీటిని పోస్తారు. సాధారణంగా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఈ సాసర్పిట్లలో నీటిని నింపుతారు. కొన్ని సమయాల్లో జనవరి నుంచే ఈ నీటిని నింపే కార్యక్రమం చేపడుతారు.
జిల్లాలోని నాలుగు చోట్ల ప్రత్యేకంగా సోలార్ బోర్వెల్స్ ఏర్పాటు చేసి వాటితో సాసర్పిట్లు, పెర్కోలేషన్ ట్యాంకులలో నీటిని నింపుతుండడంతో అటవీ జంతువులు తాగడానికి నీరు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది. నస్కల్ అటవీ ప్రాంతంలో రెండు, అనంతగిరిలో ఒకటి, ఇబ్రహీంపూర్ అటవీ ప్రాంతంలో ఒక సోలార్ బోర్వెల్స్ ఏర్పాటు చేశారు. దీంతో సంబంధిత ప్రాంతాల్లో నీటి ఇబ్బంది లేకుండా సాసర్పిట్లు, పెర్కోలేషన్ ట్యాంకులను నింపుతున్నారు. వన్య ప్రాణులకు తాగునీటి కోసం ఏర్పాటు చేసిన సాసర్పిట్లు, పెర్కోలేషన్ ట్యాంకుల వద్ద ప్రత్యేకంగా ట్రాప్ కెమెరాలను బిగించారు. ప్రతి రేంజ్కు 5 చొప్పున, జిల్లావ్యాప్తంగా 25 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. నీరు తాగేందుకు వచ్చే వన్య ప్రాణుల కదలికలన్నీ వీటిలో ఎప్పటికప్పుడు నిక్షిప్తమవుతుంటాయి. అడవిలో జింకలు, అడవిపందులు, కుందేళ్లు, కొండగొర్రెలు, ముండ్లపందులు, తోడేళ్లు ఉన్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. అడవి లోపలికి వేటగాళ్లు వెళ్లినా ఈ ట్రాప్ కెమెరాలలో రికార్డు అవుతుంది. తద్వారా అటవీ రక్షణలో, అటవీ జంతువుల రక్షణలో ట్రాప్ కెమెరాలు ఉపయోగకరంగా మారనున్నాయి.
వేసవికాలంలో ఎండుటాకులు పడుతుండడంతో బాటసారులు, వాహనదారులు కాల్చిన సిగరెట్లు, బీడీలు పడేయడంతో నిప్పంటుకొని వృక్షాలతోపాటు జంతువులకు నష్టం వాటిల్లుతుంది. మంటలు అంటుకోకుండా, ప్రమాదాలు జరుగకుండా అటవీ శాఖ వారు జిల్లాలోని అటవీ ప్రాంతంలో సుమారు 150 కిలోమీటర్ల ఫైర్ కంట్రోల్ లైన్స్ ఏర్పాటు చేయించారు. అటవీ ప్రాంతంలోని అనేక చోట్ల ఈ ఫైర్ కంట్రోల్ లైన్లు ఏర్పాటు చేయడంతో అకస్మాత్తుగా మంటలు అంటుకుంటే అడవి మొత్తం ఈ మంటలు వ్యాప్తి చెందకుండా ఫైర్ కంట్రోల్ లైన్లు అడ్డుకుంటాయి. దీంతోపాటు ముందు జాగ్రత్తగా ఆకులు, చెత్తను కాల్చివేయడం చేపట్టారు. అనంతగిరి, నస్కల్, గిరిగిట్పల్లి, నాగులపల్లి, కండ్లపల్లి తదితర ప్రాంతాలు గడ్డి భూములు కావడంతో ఈ వేసవిలో ఎక్కువగా అగ్నిప్రమాదాలు జరిగే ప్రాంతాలుగా గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో అగ్నిప్రమాదాల నివారణకు అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు.
– అబ్దుల్హాయ్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, పరిగి
వన్య ప్రాణులకు ఎండాకాలంలో తాగునీటికి ఇబ్బంది ఏర్పడకుండా సాసర్పిట్లు ఏర్పాటు చేశాం. వాటిలో ట్యాంకర్ల ద్వారా నీటిని నింపుతారు. సోలార్ బోర్వెల్స్తో ఎప్పటికప్పుడు పెర్కోలేషన్ ట్యాంకులు, సాసర్పిట్లలో నీరు నింపుతారు. వేసవిలో అగ్నిప్రమాదాలతో భారీ నష్టం నివారించేందుకు అటవీ ప్రాంతంలో ఫైర్ కంట్రోల్ లైన్స్ ఏర్పాటు చేయడం వల్ల అడవితోపాటు జంతువుల రక్షణకు దోహదం చేస్తుంది.