వికారాబాద్, ఫిబ్రవరి 6 : ప్రతి తహసీల్దార్ కార్యాలయంలో నేటి (మంగళవారం) నుంచి ధరణి హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేయాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. సోమవారం జిల్లాలోని పెండింగ్లో ఉన్న ధరణి ఫిర్యాదులపై అదనపు కలెక్టర్ రాహుల్శర్మ, డీఆర్వో అశోక్కుమార్తో కలిసి తహసీల్దార్లు, మండలాల వారి సిబ్బందితో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నెల రోజుల్లోపు ధరణి సమస్యలు పూర్తిగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. తహసీల్దార్లకు నిర్దేశించిన సమయంలోపు ధరణి సమస్యల పరిష్కారానికి కార్యాచరణ ప్రణాళికతో పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు. తహసీల్దార్ కార్యాలయంలో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రత్యేకంగా ధరణి హెల్ప్ డెస్క్ ద్వారా దరఖాస్తులను స్వీకరించాలని సూచించారు. ప్రతి సమస్యను పరిష్కార దిశగా పని చేయాలని, సమస్య పరిష్కారానికి ప్రజలకు మంచి సలహాలు సూచనలు ఇవ్వాలన్నారు. సమస్యలను ఓపికగా సహనంతో వినాలని, చికాకు పడకుండా వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వివరించారు. నెల రోజుల పాటు ధరణి సమస్యలపైనే దృష్టి పెట్టి రెవెన్యూ సిబ్బంది పని చేయాలని ఆయన ఆదేశించారు.
హెల్ప్ డెస్క్ ఎలా పని చేయాలో సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. సాంకేతిక సమస్యలు ఉంటే వాటిని సరి చేసుకుంటూ నివేదికలు పంపాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని తిరస్కరించరాదని తెలిపారు. అర్జీదారు చేసుకున్న దరఖాస్తు వాస్తవికంగా ఉంటే పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. మీ సేవా కేంద్రాలు ధరణి హెల్ప్ డెస్క్లుగా మారాలన్నారు. ప్రత్యేకంగా మీ సేవ కేంద్రాల్లో పని చేస్తున్న ఆపరేటర్లకు హెల్ప్ డెస్క్కి ఎలా పని చేయాలో శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. మీ సేవా కేంద్రాల్లో తిరస్కరించే దరఖాస్తులను అప్లోడ్ చేయకుండా చూడాలని వివరించారు. ప్రతి సోమవారం ప్రత్యేకంగా ధరణి కార్యక్రమాన్ని చేపట్టి 10.30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు దరఖాస్తులను స్వీకరించాలని ఆయన పేర్కొన్నారు. తహసీల్దార్లు స్వయంగా దరఖాస్తులను స్వీకరించాలని కలెక్టర్ ఆదేశించారు. అన్నం పెట్టే రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పుకోవడం తప్పు అన్నారు. రైతు దరఖాస్తును పరిశీలించే ముందు అది ఒక కుటుంబంగా గుర్తు చేసుకోవాలని తెలిపారు.