వికారాబాద్ : పిల్లలను ఎవరైనా దత్తత తీసుకోవాలని అనుకుంటే చట్టబద్ధంగా తీసుకోవాలని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు. గురువారం వికారాబాద్ పట్టణంలోని ఏరియా దవాఖానలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పిల్లలను దత్తత తీసుకునే పద్ధతులపై నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రభుత్వ దవాఖానను పరిశీలించి, సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. ఆసుపత్రిలో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ అటెండెన్స్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ పిల్లలను చట్టపరంగా దత్తత తీసుకోవడానికి కావాల్సిన వివరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కిట్, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. వైద్యులందరూ ప్రజలకు అందుబాటులో ఉండి, మంచి సేవలు అందించాలని సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా మహిళ శిశు సంక్షేమ శాఖ అధికారిని కేతావత్ లలితకుమార్ మాట్లాడుతూ కొంతమంది తల్లిదండ్రులు తమకు పుట్టిన పిల్లలను దవాఖానల వద్ద, బస్టాండ్లో, రైల్వే స్టేషన్లో, చెత్త కుండీల వద్ద వదిలి వేయకుండా ఉండేందుకు ఈ ఉయ్యాల అనే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ ఉయ్యాలలు స్థానిక ఏరియా దవాఖానతో పాటు తాండూరు జిల్లా దవాఖానలో సైతం ఏర్పాటు చేశామన్నారు. ఉయ్యాలలో వదిలి వెళ్లిన/ విడిచిపెట్టిన ఆ పిల్లలను మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా స్వాధీనం చేసుకొని శిశు గృహంలో ఉంచడం జరుగుతుందన్నారు. పిల్లలకు కావాల్సిన సదుపాయాలు తమ శాఖ తరపున అందివ్వడం జరుగుతుతందని పేర్కొన్నారు.
కొన్ని నెలల తరువాత సమాచారం లేని పిల్లలను సెంట్రల్ అడాప్షన్ ఏజెన్సీ ద్వారా సంతానం లేని తల్లిదండ్రులు, అక్రమ దత్తత ద్వారా కాకుండా లీగల్గా పిల్లలను శిశు సంక్షేమ శాఖ ద్వారా అప్పగించడం జరుగుతుందన్నారు. ఈ దత్తత ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని, ప్రాధాన్య క్రమంలో పిల్లలను అప్పగించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, డీఎంహెచ్వో తుకారం, ఎంపీపీ చంద్రకళ, సీడీపీవో వెంకటేశ్వరమ్మ, డిస్టిక్ చైల్డ్లైన్ ప్రొటెక్షన్ యూనిట్ సిబ్బంది ఉన్నారు.