పరిగి : కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనమని స్పష్టంగా చెప్పినందున యాసంగిలో వరికి బదులు ఇతర ఆరుతడి పంటలు సాగు చేసుకునేలా రైతులకు అవగాహన కల్పించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల వ్యవసాయాధికారులను ఆదేశించారు. సోమవారం డీపీఆర్సీ భవనంలో వ్యవసాయ శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యాసంగిలో వరి కొనుగోలు కేంద్రాలు ఉండవని, రైతులు వరి పండించి నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత వ్యవసాయ అధికారులదేనని కలెక్టర్ పేర్కొన్నారు. వ్యవసాయ విస్తరణాధికారులు రైతులను కలిసి వరికి బదులు ఇతర పంటలు సాగు చేసేలా అవగాహన కల్పించాలన్నారు. అవసరమైన ఇతర పంటల విత్తనాలు అందుబాటులో ఉంచాలని కలెక్టర్ చెప్పారు.
ప్రతిరోజు వ్యవసాయాధికారులు ఉదయం అందుబాటులో ఉండి రాబోయే 15రోజులు బాగా పని చేసి పంటమార్పిడిపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి సేకరించిన ధాన్యానికి సంబంధించిన డబ్బులు రైతుల ఖాతాలలో వెంటనే జమ అయ్యేలా చూడాలన్నారు. క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. తాను ఇకనుంచి క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తానని ఆమె తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి గోపాల్, జిల్లా పౌర సరఫరాల అధికారి రాజేశ్వర్, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ విమల, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు, మండల వ్యవసాయాధికారులు, వ్యవసాయ విస్తరణాధికారులు పాల్గొన్నారు.