వికారాబాద్ : జిల్లాలో పకడ్బందీగా నాకాబందీ జరుగుతుందని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్రమ ఇసుక రవాణా, ప్రభుత్వ నిషేధ గుట్కా, గంజాయి, రాత్రి సమయంలో దొంగతనాలు, అక్రమ ట్రాన్స్పోర్ట్, పేకాట, మట్కా తదితర అసాంఘీక కార్యక్రమాలపై నాకాబందీ నిర్వహించడం జరుగుతందన్నారు. ఇందులో భాగంగా వాహనాలకు సంబంధించిన సరైన ధృవపత్రాలు లేక పోవడంతో వాహనాలను సీజ్ చేయడం జరిగిందన్నారు.
కొడంగల్లో పోలీస్ స్టేషన్ లిమిట్లో కర్నాటక నుంచి రెండు కలప లారీలు వస్తుంటే వాటిని పట్టుకొని సీజ్ చేయడం జరిగిందన్నారు. మోమిన్పేట పోలీస్ స్టేషన్లో కాకతీయ కంపెనీ నుంచి 80కిలోల ఇనుమును దొంగిలించిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 933 వాహనాలు తనిఖీ చేయడం జరిగిందని, 6 వాహనాలను సీజ్ చేశామని తెలిపారు.