వికారాబాద్ : వికారాబాద్ సమీపంలోని అనంతగిరి అడవిలో స్వయంబుగా వెలసిన అనంతపద్మనాభ స్వామి కార్తీకమాస పెద్ద జాతర ఆదివారం ప్రారంభం అయింది. ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. ఆదివారం దశమి సందర్భంగా ప్రారంభమైన జాతరకు వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి తదితర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. కార్తీకమాసం జాతర సందర్భంగా ఆలయ సమీపంలో ఉన్న ఉసిరి చెట్టు వద్ద మహిళలు దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారిని దర్శించుకుని ఆలయ ఆవరణలో సేదతీరారు. అటవీ ప్రాంతంలో సరదగా గడుపుతూ సహపంక్తి భోజనాలు చేశారు.
అనంతరం నంది ఘాట్ వద్దకు చేరుకున్న పర్యాటకులు ట్రెక్కింగ్ చేస్తూ ప్రకృతిని ఆస్వాధించారు. చిన్నారులు, పెద్దలు, మహిళలు సైతం ఆనందంగా గడిపారు. సాయంత్రం 4 గంటలకు ధ్వజారోహణం, పుణ్యాహవచనం కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో వెలసిన తినుబండరాలను భక్తులు సైతం కొనుగోలు చేశారు.