పరిగి : పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం ఇవ్వాలన్నది సీఎం కేసీఆర్ ప్రధాన సంకల్పమని మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలె ఒక కమిటీ వేసి, దాని ప్రతిపాదనలు ఆమోదించుకుని ముందుకెళ్లాలని కోరారు. పోడు భూముల సమస్య పరిష్కారం, అడవుల సంరక్షణపై వికారాబాద్ జిల్లా డీపీఆర్సీ కేంద్రంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలో శనివారం అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భవిష్యత్లో మళ్లీ పోడు భూముల సమస్యలు ఉత్పన్నం కాకుండా, పోడు చేసుకుంటున్న అర్హులందరికీ న్యాయం చేస్తూ పట్టాలు ఇచ్చి, ఆ భూములను వ్యవసాయ యోగ్యంగా మార్చడం జరుగుతుందన్నారు.
అడవిని సంరక్షించి భవిష్యత్ తరాలకు మంచి పర్యావరణం అందించాలన్నది సీఎం కేసీఆర్ సంకల్పమని అన్నారు. లక్షా 8వేల ఎకరాల అటవీ వైశాల్యం ఉన్న జిల్లా వికారాబాద్ అని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 68లక్షల ఎకరాల అటవీ భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించారని పేర్కొన్నారు. తెలంగాణ సరిహద్దు రాష్ట్రాలు కర్నాటక, మహారాష్ట్రల నుంచి మన ప్రాంతంలోకి రాగానే చెట్లను చూడగానే తెలంగాణ అని తెలుస్తుందన్నారు. ఆర్వోఎఫ్ఆర్ అర్హులందరికీ పట్టాలు ఇస్తామని మంత్రి తెలిపారు. 2005 నుంచి నేటి వరకు శాటిలైట్ మాప్స్ తమ దగ్గర ఉన్నాయని, చట్టబద్ద అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి హక్కు పత్రం వస్తుందన్నారు. సర్వే జరిగే సమయంలో గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, పార్టీల నేతలు దగ్గరుండి పరిశీలించాల్సిందిగా మంత్రి సూచించారు.
సర్వే చేసి హద్దులు నిర్ణయిస్తే భవిష్యత్లో సమస్యలు రావని, కొత్తగా ఎవరు కబ్జాకు ప్రయత్నం చేయకుండా చూడాలన్నారు. అఖిలపక్షంలో వచ్చిన సలహాలు, సూచనలను స్వీకరిస్తూ పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ సునితారెడ్డి, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కొప్పుల మహేశ్రెడ్డి, నరేందర్రెడ్డి, ఫైలెట్ రోహిత్రెడ్డి, జిల్లా కలెక్టర్ నిఖిల, జెడ్పీ వైస్ చైర్మన్ విజయ్కుమార్, అదనపు కలెక్టర్లు మోతిలాల్, చంద్రయ్య, వివిధ పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.