చౌటుప్పల్ రూరల్, జనవరి 13 : హైదరాబాద్ – విజయవాడ (65వ) జాతీయ రహదారిపై వాహనాల రద్దీ భారీగా పెరిగింది. పండుగకు ఒక రోజు ముందునుంచే ప్రభుత్వం సెలవులు ప్రకటించడంతో హైదరాబాద్లో నివసించే ప్రజలు తమ స్వగ్రామాల బాటపట్టారు. వేల సంఖ్యలో వాహనాలు జాతీయ రహదారిపైకి రావడంతో యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంతో పాటు పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ ఏర్పడింది. ట్రాఫిక్ స్తంభించి పోకుండా ఎన్హెచ్ఏఐ, జీఎంఆర్, పోలీసు యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ట్రాఫిక్ నియంత్రణకు అదనపు సిబ్బందిని నియమించారు.
ఫాస్టాగ్ విధానం ఉన్న వాహనాలు వెంటనే టోల్ప్లాజా దాటి వెళ్తుండగా.. ఫాస్టాగ్ లేని వాహనాలు అధిక సమయం స్తంభించి పోతున్నాయి. పంతంగి టోల్ప్లాజా వద్ద 16టోల్ బూత్లు ఉండగా.. విజయవాడ వైపు 10 బూత్లు తెరిచారు. ట్రాఫిక్ నియంత్రణకు తంగడపల్లి క్రాస్ రోడ్డును మూసివేశారు. కాగా నిత్యం ఈ రహదారి గుండా 30వేల పైచిలుకు వాహనాలు వెళ్తుండగా వీకెండ్, సెలవు దినాల్లో మరో ఐదారు వేలు అదనంగా ప్రయాణిస్తాయని అధికారులు తెలుపుతున్నారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు అదనంగా 20వేలకు పైగా వాహనాలు వెళ్లవచ్చని జీఎమ్మార్ అధికారులు అంచనా వేస్తున్నారు.