కొత్తూరు, జనవరి 14 : జహంగీర్పీర్ దర్గా ఉర్సును ఘనంగా నిర్వహిస్తామని వక్ఫ్ బోర్డు చైర్మన్ ముసిఉల్లాఖాన్, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కొత్తూరు మండలంలోని జహంగీర్పీర్ దర్గా ఉర్సు ఈ నెల 19 నుంచి నిర్వహిస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లను వక్ఫ్ బోర్డు చైర్మన్ ముసిఉల్లాఖాన్, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు దర్గాలో ఉర్సు కోసం చేయాల్సిన ఏర్పాట్లను వక్ఫ్ బోర్డు అధికారులను అడిగి తెలుసుకున్నారు.
వ్యాపారులకు నష్టం లేకుండా దర్గా మాస్టర్ ప్లాన్
వ్యాపారులకు నష్టం వాటిల్లకుండా దర్గా డెవలప్మెంట్ మాస్టర్ ప్లాన్ అమలు చేయాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ సూచించారు. దర్గా అభివృద్ధికి సీఎం కేసీఆర్ రూ.50 కోట్లు కేటాయించారని ముసిఉల్లాఖాన్ చెప్పారు. మాస్టర్ ప్లాన్ అమలు ఆలస్యమవుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్, ఎమ్మెల్యే దర్గా పరిసర ప్రాంతాలను కలియతిరిగి మాస్టర్ ప్లాన్ అమలుపై చర్చించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గణేశ్, వక్ఫ్ బోర్డు ఓఎస్డీ అసదుల్లాఖాన్, వక్ఫ్ బోర్డు సూపరింటెండెండ్ సలీం, ఇంజినీర్ ఇంతియాజ్, ఇన్ముల్నర్వా సర్పంచ్ అజయ్నాయక్, టీఆర్ఎస్ నాయకుడు దేవేందర్యాదవ్, కౌన్సిలర్ శ్రీనివాస్, దర్గా సూపరింటెండెంట్ అబ్దుల్ సత్తార్ పాల్గొన్నారు.